jharkhand exit poll: అంచనాలు తప్పట, బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందట, సీఎం రఘుబర్ దాస్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ చతికిలబడిందని ఎగ్జిట్ పోల్స్ కోడై కూస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టబోతుందని ఢంకా బజాయించి చెప్తున్నాయి. కానీ జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ మాత్రం ఎగ్జిట్ పోల్ అంచనాలపై పెదవి విరిచారు. పోల్స్ తప్పని చిందులేశారు. తిరిగి తమ ప్రభుత్వం అధికార చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై దాదాపు అన్ని సంస్థలు కాంగ్రెస్ కూటమి మెజార్టీ సీట్లు సాధిస్తాయని చెప్పాయి. కానీ బీజేపీ సీనియర్ నేత, సీఎం రఘుబర్ దాస్ మాత్రం అంచనాలను తప్పుపట్టారు. ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోవని తేలికగా కొట్టిపారేశారు. జార్ఖండ్లో తిరిగి తమ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో సీఎం రఘుబర్ దాస్ విజయం సాధిస్తామని విశ్వాసమా, లేదంటే ఓడిపోతామనే భయంతో కామెంట్ చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
జార్ఖండ్లో 81 అసెంబ్లీలో స్థానాలు ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 41 సభ్యుల మద్దతు తప్పనిసరి. కానీ అన్నీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ 20 నుంచి 30 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేశాయి. దీంతో పోల్స్ అంచనాలను సీఎం తప్పుపట్టారు. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిష్టర్తో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆ విధంగా ఉన్నాయి.