కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ కలిస్తే యూపీలో బీజేపీకి 5 సీట్లే, లేదంటే 18 స్థానాలు
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉత్తర ప్రదేశ్లో బీజేపీ, మిత్రపక్షాలు 18 సీట్లు గెలుచుకుంటాయని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం నాలుగు సీట్లు వస్తాయని తేలింది.
2014 ఎన్నికల్లో ఎన్డీయే డెబ్బైకి పైగా సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు బీజేపీ, దాని మిత్రపక్షం అప్నాదళ్కు కలిపి కేవలం పద్దెనిమిది వస్తాయని ఈ సర్వేలో తేలింది. అంటే గత ఎన్నికల కంటే 53 సీట్లు తగ్గనున్నాయి. అదే సమయంలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ మిత్రపక్షాలకు 58 సీట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే నాలుగు సీట్లకు మించి రావని తేలింది.
కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ, బీఎస్పీలు జత కడితే బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. అప్పుడు బీజేపీకి కేవలం 5 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలింది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిస్తే వారికి 75 సీట్లు వస్తాయని తేలింది. అయితే ఆసక్తికర విషయం ఏమంటే ఈ సర్వే కోసం 2,400 మందితో శాంపిల్ తీశారు.