వీడిన పీటముడి: శివసేనకు బీజేపీ మద్దతు.. 8న మేయర్ ఎన్నిక
ఎట్టకేలకు ప్రతిష్ఠంభన వీడింది. బ్రుహన్ ముంబై మహా నగర పాలక సంస్థ (బీఎంసీ)లో మేయర్, డిప్యూటీ మేయర్ తదితర కీలక పదవుల ఏకగ్రీవ ఎన్నికకు ఒక అడుగు ముందుకు పడింది.
ముంబై: ఎట్టకేలకు ప్రతిష్ఠంభన వీడింది. బ్రుహన్ ముంబై మహా నగర పాలక సంస్థ (బీఎంసీ)లో మేయర్, డిప్యూటీ మేయర్ తదితర కీలక పదవుల ఏకగ్రీవ ఎన్నికకు ఒక అడుగు ముందుకు పడింది.
227 స్థానాలు గల బీఎంసీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన బిజెపి, శివసేన 82, 84 స్థానాలతో సమఉజ్జీలుగా నిలిచాయి. దీంతో ఎవరి వాదనకు వారే కట్టుబడి ఉన్నారు. కానీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే.. బీజేపీకి చెక్ పెట్టేందుకు అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు కూడా సై అన్నారు.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వైదొలిగిన తర్వాతే స్పందిస్తామని తొలుత మెలిక పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. తర్వాత కాషాయ సిద్ధాంతాల కారణంగా మద్దతునివ్వలేమని తేల్చి చెప్పింది. తాము విపక్షంలోనైనా కూర్చునేందుకు సిద్ధమన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. అవినీతిమయమైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపబోమన్నారు.
ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తమ పార్టీ శివసేన, బీజేపీలకు సమదూరం పాటిస్తానని పేర్కొన్నారు. మరోవైపు రాజ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) మద్దతు కోసం ఇరు పార్టీలు ప్రయత్నించినా శివసేనకే బాసటగా నిలిచారు. ఇటు శివసేన, అటు బిజెపి స్వతంత్ర కార్పొరేటర్లు, చిన్న పార్టీల ఎమ్మెల్యేలపై ద్రుష్టి సారించారు. ఫలితంగా శివసేన బలం 88, బీజేపీ బలం 84కు చేరుకున్నది.
శివసేనకు మద్దతనిస్తామన్న ఫడ్నవీస్
ప్రధాని నరేంద్రమోదీ, ఇతర కేంద్రమంత్రులతో సంప్రదింపుల తర్వాత మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వరం మారింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశమివ్వకుండా తామే తగు చర్యలు తీసుకుంటామని సంకేతాలిచ్చిన ఫడ్నవీస్ శనివారం మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ, ఇంప్రూవ్మెంట్ కమిటీల ఎన్నికల్లోనూ అభ్యర్థులను నిలుపబోమని తేల్చేయడంతో ఆయా పదవుల ఎన్నిక ఏకగ్రీవం అని తేలిపోయింది. నగర పాలక సంస్థలో పారదర్శకత పాలన పట్ల బీజేపీ ఇచ్చిన హామీలను ముంబై నగర వాసులు అంగీకరించినా ఎన్నికల్లో శివసేన అతిపెద్ద పార్టీగా అవతరించిందని ఫడ్నవీస్ అంగీకరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకునేందుకు అవసరమైన కార్పొరేటర్ల మద్దతు తమకు లేదని ఫడ్నవీస్ అన్నారు.
విపక్షంలోనూ కూర్చోబోమన్న ఫడ్నవీస్
ముంబై మహా నగర ప్రజల ప్రయోజనాల ద్రుష్టా తాము మేయర్ ఎన్నిక విషయంలో అవసరమైతే శివసేనకు మద్దతునిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. తాము విపక్షంగానూ వ్యవహరించబోమని వివరణ ఇచ్చారు. ఫడ్నవీస్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే శివసేన మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ చేసే అభ్యథుల పేర్లను ప్రకటించింది. ఈ నెల 8న మేయర్ ఎన్నికలు జరుగుతాయి. కానీ బీజేపీతో పొత్తు ఉండదని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది శివసేన.
మేయర్గా విశ్వనాథ్ మహాదీశ్వర్
ముంబై మహా నగర మేయర్గా విశ్వనాథ్ మహాదీశ్వర్, డిప్యూటీ మేయర్గా హమాంగీ వరలీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. బీఎంసీలో మహదీశ్వర్కు ఇది మూడో పదవి. తొలిసారి బీఎంసీ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్గా, రెండోసారి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. విద్యావంతుడైన మహదీశ్వర్.. రాజే శంభాజీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా వ్యవహరించారు. ఈ దఫా 87వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి మహేశ్ పార్కర్, కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేశ్ వ్యావాలపై విశ్వనాథ్ మహదీశ్వర్ పోటీలో విజయం సాధించారు. కాగా, మేయర్ పదవికి విశ్వనాథ్ మహదీశ్వర్, డిప్యూటీ మేయర్ గా వరలీకర్ తమ నామినేషన్లను సమర్పించారు. అంతకుముందు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తన నివాసంలో పార్టీ సీనియర్లతో చర్చించాకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఖరారుచేశారు.
ఇది లొంగుబాటు కాదన్న మహారాష్ట్ర సీఎం
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన తమ ప్రభుత్వ స్థిరత్వం కోసం శివసేన ముందు సాగిలపడినట్లు కాదని కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ముంబై మేయర్ ఎన్నికకు, మహారాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వానికి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నదని, శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేవానికి శివసేన మంత్రులు కూడా హాజరయ్యారని చెప్పారు.
పారదర్శకతపై కమిటీ
పాలనలో పారదర్శకత సాధనపై మాజీ బ్యూరోక్రాట్లు రామ్ నాథ్ ఝా, గౌతం చటర్జీ, శరద్ కాలే తదితరులతో ఒక కమిటీని నియమిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. రాష్ట్రంలోని నగర పాలక సంస్థల్లో పారదర్శకత తేవడానికి అనుసరించాల్సిన విధి విధానాలపై ఈ కమిటీ సిఫారసులు అందజేస్తుందన్నారు. కమిటీ మూడు నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్నారు. లోకాయుక్తకు కూడా కొత్త న్యాయమూర్తిని నియమిస్తామన్నారు.
పశ్చిమ ముంబై శివార్లలో శివసేనపై బీజేపీ ఆధిపత్యం
ముంబై నగరానికి పశ్చిమ దిశలో గల శివారు ప్రాంతాల్లోనే శివసేనపై బీజేపీ ఆధిక్యం సాధించగలిగింది. బీజేపీ గెలుచుకున్న 1.2 కోట్ల ఓట్లలో 55.95 % శాతం పశ్చిమ ముంబై నగర శివారుల్లో పోలయినవే. వారిలో అత్యధికులు మరాఠీలు, గుజరాతీలు, ఉత్తర భారతీయులు ఉన్నారు. గుర్గావ్, జోగీశ్వరి, అంధేరిలలో బీజేపీకి అత్యధిక ఓట్లు లభించాయి. పలు స్థానాల్లో శివసేన, బీజేపీ మధ్య అతి స్వల్ప తేడాతో ఫలితాల్లో తేడా వచ్చింది. రెండు పార్టీల మధ్య తేడా కేవలం 51,293 ఓట్లు మాత్రఇంతకుముందు ఈ ప్రాంతాలన్నీ శివసేనకు పట్టు ఉన్న. శివసేన 22.90 (28.78%) ఓట్లు పొందింది. రాజ్ థాకరే సారథ్యంలోని ఎమ్మెన్నెస్ 5.6 % ఓట్లు పోలైనా ఈ ప్రాంతంలో ఒక్క కార్పొరేటర్ ను కూడా గెలుచుకోలేకపోయింది. ఎన్సీపీ కేవలం 2.68 % ఓట్లతో రెండు సీట్లు గెలుచుకున్నది.