జయలలిత బతికి ఉంటే: బీజేపీ ప్రభుత్వం-మోడీపై మమత నిప్పులు
కోల్కతా: జయలలిత బతికి ఉంటే అన్నాడీఎంకే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ఉండేదని, బీజేపీకి అనుకూలంగా ఉండకపోయేవారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని ఉద్దేశించి తాలిబన్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ సంఖ్యాబలం 150 సీట్లకు మించదని మమత అన్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో ఎన్డీయే 325 ఓట్లను కలిగి ఉందని, ఈ సంఖ్యాబలం వచ్చే లోకసభ ఎన్నికల్లో బాగా పడిపోతుందని చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ రాష్ట్రంలోని మొత్తం 42 లోకసభ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు.
దేశాన్ని రక్షించేందుకు తాము బీజేపీని తరిమికొడతామన్నారు. ఇదే తమ ప్రతిజ్ఞ అన్నారు. బీజేపీని ఓడించడానికి ఫెడరల్ ఫ్రంట్ మార్గాన్నిఅనుసరించనున్నట్లు తెలిపారు. కుర్చీ గురించి తమకేం బాధలేదని, తమ ఆలోచన అంతా దేశం, ప్రజల గురించే అన్నారు.
లోకసభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గుతూ వస్తోందని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలే ఇందుకు నిదర్శనం అన్నారు. బెంగాల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సాయం అక్కరలేదని చెప్పారు.
బీజేపీ, ఆరెస్సెస్లలో తాను గౌరవించే మంచి వ్యక్తులు చాలామంది ఉన్నారని, కానీ కొంతమంది నీచరాజకీయాలు చేస్తున్నారన్నారు. కాగా, 1993 జూలై 21న పోలీసుల కాల్పుల్లో 13 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మృతి చెందారు. అప్పటి నుంచి టీఎంసీ ప్రతి ఏటా అమరవీరుల దినంగా పాటిస్తోంది.