హర్యానాలో గోపాల్ కందా మద్దతు తీసుకోబోం.. నేరచరిత్ర అని కొత్త పల్లవి అందుకున్న రవిశంకర్
బోడి మల్లన్న సామెత ప్రస్తుత రాజకీయాలకు కరెక్టుగా సరిపోతోంది. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తూ సిద్ధాంతాలకు రాజకీయ పార్టీలు, నేతుల తూట్లు పొడుస్తున్నారు. హర్యానాలో ఏ పార్టీ మెజార్టీ రాకపోవడంతో.. అధికార బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తెగ ప్రయత్నాలు చేసింది. నేరచరిత్ర తదితర అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. కానీ జేజేపీ మద్దతు ఇస్తామని చెప్పడంతో కొత్త పల్లవి అందుకుంది.
హర్యానాలో బీజేపీతో జేజేపీ జట్టుకట్టింది. ఇంకేముంది తమకు ఇండిపెండెంట్ల మద్దతు ఎందుకు అని బీజేపీ అనుకొంది. ఫలితాలు వెలువడినప్పటి నుంచి హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకుంటామని, ఇండిపెండెంట్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీరాలు పలికింది. జేజేపీ 10 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో ప్లేటు ఫిరాయించింది. తమకు నీతి, ధర్మం, న్యాయం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రారంభించింది.
గోపాల్ కందా నేరచరిత్ర నేపథ్యంలో ఆయన మద్దతు తీసుకోవాలని అనుకోవడం లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరించారు. గోపాల్ కందాపై లైంగికదాడి, అసభ్య ప్రవర్తన, నేరచరిత్ర లాంటి కేసులు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే జేజేపీ సపోర్ట్ ఇవ్వనప్పుడు మాత్రం ఆయనకు ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. అవసరం ఉన్నప్పుడు మద్దతు తీసుకుంటామని చెప్పి.. తర్వాత మాత్రం పక్కనపెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ తీరుపై కందా కూడా గుర్రుమీదున్నట్టు తెలుస్తోంది. ఫలితాల తర్వాత మద్దతివ్వాలని అడిగి.. ఇప్పుడు మాట మార్చడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.