బెంగాల్లో బీజేపీకి రెండంకెల సీట్లు వస్తే గొప్ప : ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్..హైప్ మాత్రమే..!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ వర్సెస్ మోడీగా సీన్ మారింది. ఇక ఆ రాష్ట్రంలో పాగా వేయాలని ఆశిస్తున్న కమలనాథులు వ్యూహాలకు పదను పెట్టారు. మొన్నటికి మొన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వెస్ట్బెంగాల్లో పర్యటించగా బీజేపీ కార్యకర్తలకు టీఎంసీ కార్యకర్తల మధ్య భీకర పోరే జరిగింది. ఇక తాజాగా అమిత్ షా బెంగాల్లో పర్యటించగా వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి కనిపిస్తోంది. వచ్చే ఏడాదిలో ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మమతా కోటను కూల్చేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. పక్కా ప్రణాళికతో ఆ రాష్ట్రంలో ముందుకు దూసుకెళుతున్నారు. మరోవైపు ముస్లిం మెజార్టీ నియోజకవర్గాలను టార్గెట్ చేశారు మజ్లిస్ అధినేత ఓవైసీ. ఇలా మమతా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముప్పేట దాడి జరుగుతోంది. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీకి ఈ సారి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ప్రశాంత్ కిషోర్ సవాల్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ చాలా హైప్ క్రియేట్ చేస్తోందని వాస్తవానికి పరిస్థితి వారికి అనుకూలంగా లేదని ఇది కేవలం మీడియా హైప్ మాత్రమే అని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. అది కూడా ఓ వర్గం మీడియా మాత్రమే ఈ హైప్ క్రియేట్ చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. అంతేకాదు తాను చేసిన ఈ ట్వీట్ను సేవ్ చేసుకుని ఉంచుకోవాలని భవిష్యత్తులో తాను చెప్పిన విషయం నిజమవుతుందని ప్రశాంత్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఒకవేళ బీజేపీ నిజంగా వండర్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తే తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా రాణిస్తున్న రంగాన్ని వీడుతానని సవాల్ చేశారు.
Recommended Video
డ్యామేజ్ కంట్రోల్కు రంగంలో ప్రశాంత్ కిషోర్
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా... తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇప్పటికే బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. మమతకు హ్యాండిచ్చి బీజేపీకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు టీఎంసీ నేతలు.దీంతో టీఎంసీలో కాస్త కలవరం మొదలైంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్లో బీజేపీ రెండంకెలను తాకడం చాలా కష్టమని జోస్యం చెప్పారు. అంతేకాదు టీఎంసీ బలమైన నాయకుడు సువేందు అధికారితో పాటు పలువురు కీలక నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో టీఎంసీ దిద్దుబాటు చర్యలకు దిగింది.మమతా బెనర్జీ పార్టీలో డ్యామేజ్ను తగ్గించేందుకు స్వయంగా ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు.