బరిలో బీజేపీ: పౌరసత్వంపై కౌంటర్ అటాక్: ఏబీవీపీ, సంఘ్ పరివార్ ద్వారా ప్రచారోద్యమం..!
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వి సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలపై బారతీయ జనతా పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం తగ్గుముఖం పట్టిన వెంటనే- తాను రంగంలోకి దిగాలని భావిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచారాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.
వర్క్ షాపులు, సదస్సులు, చర్చాగోష్ఠీలు..
పౌరసత్వి సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలపై వ్యతిరేక జ్వాలలు ప్రజ్వరిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు అంశాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి, భయాందోళనలను తొలగించడానికి వర్క్ షాపులు, సదస్సులు, చర్చాగోష్ఠీలను చేపట్టాలని యోచిస్తోంది. దశలవారీగా వాటిని నిర్వహించవచ్చని అంటున్నారు.
విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయి కళాశాలల్లో..
దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో తొలిదశలో ఈ తరహా చర్చాగోష్ఠీలను ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు. దీనికోసం భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ లతో పాటు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మద్దతును తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ దిశగా ఓ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్లు సమాచారం.
సందేహాలను నివృత్తి చేయడానికి ప్రాంతీయ భాషల్లో..
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు సంబంధించిన చట్టాన్ని ప్రాంతీయ భాషల్లో ముద్రించి, విస్తృతంగా పంచి పెట్టాలని, చట్టం వల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ భాషల్లో ముద్రించిన ప్రతులు ప్రతి ఇంటికి చేర్చేలా క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు, పార్టీ నాయకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్ ల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
10 రోజుల్లోనే అమలు..
ఈ కార్యాచరణ ప్రణాళికను వచ్చే 10 రోజుల్లోనే అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపై బీజేపీ రాష్ట్రశాఖ నాయకులకు ఇప్పటికే సూచన ప్రాయంగా ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. అల్లర్లు, హింసాత్మక పరిస్థితులు తగ్గుముఖం పట్టిన వెంటనే ఇక ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. ఒక్కో రాష్ట్రంలో ప్రాంతాలు, జిల్లాలవారీగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని, వాటిని అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయికి తీసుకెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు.