పీయూష్ గోయల్ సర్వే: బీజేపీకి 297 నుంచి 303 సీట్లు ఖాయం, 2014లో అదే జరిగింది
ముంబై: 2014 లోకసభ ఎన్నికల్లో అనూహ్యంగా 280కి పైగా స్థానాలు సొంతగా గెలిచిన భారతీయ జనతా పార్టీ వచ్చే 2019 ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుస్తుందనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది. దీనిపై పలుమార్లు పలు ముందస్తు సర్వేలు జరిగాయి. దాదాపు అన్ని సర్వేల్లో ఒకటే అంశం తేలింది.
వచ్చే ఎన్నికల్లోను బీజేపీదే అధికారమని, కానీ గతంలో కంటే సీట్లు తగ్గుతాయని, మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే, తాజాగా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చి చెప్పారు. ఈ మేరకు తాను చేయించిన సర్వేలో ఎన్ని సీట్లు వస్తాయో తెలిందని చెప్పారు.
297 నుంచి 303 సీట్లు
2019లో జరిగే లోకసభ ఎన్నికల్లో బీజేపీ సోంతగా 297 నుంచి 303 సీట్లు సొంతం చేసుకుంటుందని పీయూష్ గోయల్ తెలిపారు. ఆ లెక్కన 2014 కంటే ఈ సీట్లు ఎక్కువ. దాదాపు మూడు వందల సీట్లు సాధిస్తామని తమ సొంత సర్వేలో వెల్లడయిందని చెప్పారు. ఈ సర్వేను తన టీంతో నిర్వహించినట్లు చెప్పారు. దేసవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని 5.40 లక్షల మందిని ప్రశ్నించి రూపొందించినట్లు చెప్పారు.
అప్పుడు సర్వే చేసినప్పుడు దాదాపు కచ్చితమైన ఫలితాలు
2013లోను ఇదే తరహా సర్వే నిర్వహించామని, అప్పుడు కూడా కచ్చితమైన ఫలితాలు వచ్చాయని గోయల్ తెలిపారు. ఈ సర్వేను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించినట్లు చెప్పారు. బీజేపీ మంచి ఫలితాలు రాబట్టనుండటం సంతోషకరమని చెప్పారు. ఓ ప్రయివేటు ఏజెన్సీ సాయంతో ఈ సర్వే చేయించామని చెప్పారు.
ఇటీవలి ప్రయివేటు సంస్థ సర్వేలోను మోడీ హవా
ఈ సర్వేను బీజేపీ చేయలేదని, కానీ బీజేపీ చేయించిందని గోయల్ చెప్పారు. ఐదున్నర లక్షల మందిని భాగస్వామ్యం చేస్తూ ఇప్పటి వరకు ఏ సర్వే జరగలేదని చెప్పారు. ఇటీవల వచ్చిన టైమ్స్ నౌ - సీఎన్ఎక్స్ ప్రీ పోల్ సర్వేలోను 69 శాతం మంది మళ్లీ మోడీయే ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
బీజేపీకి ఆనందం
కాగా, బీజేపీకి ఇది సంతోషాన్ని ఇచ్చే సర్వేనే. ఎందుకంటే ఇటీవల వరుసగా పలు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. దీంతో 2014లో 282 స్థానాలు ఉన్న బీజేపీకి ఇప్పుడు మేజిక్ ఫిగర్ మాత్రమే ఉంది. ఎన్డీయేలోని పార్టీలతో కలిసి బీజేపీకి 336స్థానాలు 2014లో ఉన్నాయి. ఇప్పుడు మిత్రపక్షాలు దూరం కావడం, పలు ఓటముల కారణంగా ఆ సంఖ్య 310 వరకు చేరుకుంది.