ఢిల్లీ బీజేపీదే, గుర్తుపెట్టుకోండి: ఎగ్జిట్ పోల్స్ ట్రాష్ అంటూ మనోజ్ తివారీ సంచలనం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పలు మీడియా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దాదాపు అన్ని మీడియా ఛానళ్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే మళ్లీ ఢిల్లీలో అధికారం చేపడుతుందని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో బీజేపీతో అధికారం..
ఇప్పుడు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ తప్పేనని మనోజ్ తివారీ అన్నారు. తాను చేసిన ట్వీట్ను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సూచించారు. అంతేగాక, 48 స్థానాల్లో గెలిచి ఢిల్లీలో బీజేపీనే అధికారం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. అయితే, ఇప్పట్నుంచే ఈవీఎంల మీద ఆరోపణలు చేయడం మానుకోవాలని ఇతర పార్టీలకు హితవు పలికారు.
సిక్స్త్ సెన్స్ అంటూ మనోజ్ తివారీ..
ఇంతకుముందు కూడా మనోజ్ తివారీ ఢిల్లీలో బీజేపీ అధికారం చేపడుతుందని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని తన సిక్స్త్ సెన్స్ చెప్తోందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి 50 సీట్ల కంటే ఎక్కువగానే వస్తాయని అన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
అరవింద్ కేజ్రీవాల్కే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
కాగా, శనివారం ఎన్నికల అనంతరం విడుదలైన మీడియా ఛానళ్ల ఎగ్జిట్ పోల్స్ మాత్రం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీనే మళ్లీ అధికారం చేపడుతుందని స్పష్టం చేశాయి. బీజేపీ మాత్రం 10-20 సీట్లతో రెండో స్థానానికే పరిమితమవుతుందని తేల్చి చెప్పాయి. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం 1 స్థానానికే పరిమితమవుతుందని వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ గమనించినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న వెలువడే ఫలితాలపై ఉత్కంఠ నెలకొని ఉంది.
సంబరాల్లో ఆప్ శ్రేణులు.. 11న ఫలితాలపైనే బీజేపీ..
2015లో బీజేపీకి కేవలం 3 సీట్లు మాత్రమే రావడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ పార్టీ 50-60 మధ్య స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. దీంతో అరవింద్ కేజ్రీవాల్ తోపాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ నేతలు మాత్రం అసలైన ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాలని, ఎగ్జిట్ పోల్స్ అంత ఖచ్ఛితమైన ఫలితాలు ఇవ్వవని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్లో ఘోరమైన ఫలితాలు చూపడంతో ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఏం మాట్లాడటం లేదు.