పశ్చిమ బెంగాల్ ఫైట్ : బీజేపీకి 200కి పైగా సీట్లు, మే 3న బిజెపి ముఖ్యమంత్రి : ఎంపీ తేజస్వి సూర్య ధీమా
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు శరవేగంగా పావులు కదుపుతున్నాయి . ప్రచార పర్వాన్ని హోరెత్తుతున్నాయి. అధికార టీఎంసి ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోమారు పశ్చిమ బెంగాల్ లో అధికారం చేపట్టాలని ప్రయత్నాలు సాగిస్తుంటే, టీఎంసికి చెక్ పెట్టి కాషాయ జెండా రెపరెపలాడించాలని కమలనాథులు విఫలయత్నం చేస్తున్నారు. ఎవరికి వారు విజయం తమదే అన్న ధీమాలో ఉన్నారు.
200 స్థానాల్లో బీజేపీ విజయం , మే 3న బీజేపీ సీఎంను చూస్తాం : ఎంపీ తేజస్వి సూర్య
పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు కమలనాథులు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని 294 సీట్లలో బీజేపీ రెండువందలకు పైగా స్థానాలను గెలుచుకుంటుందని, మే 3వ తేదీన పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ముఖ్యమంత్రి పాలన సాగిస్తారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు ఇదే విధంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ కి రోజులు లెక్కించుకునే సమయం ఆసన్నమైందని తేజస్వి సూర్య అభిప్రాయపడ్డారు.
మే 3వ తేదీ తర్వాత రాష్ట్రంలో రక్తపాతం కానీ, రాజకీయ హత్యలు కానీ ఉండవు
మే 3వ తేదీ తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రక్తపాతం కానీ, రాజకీయ హత్యలు కానీ ఉండవని, ఎందుకంటే కమ్యూనిస్టుల వారసత్వం ఉండబోదని , మమతాబెనర్జీ కాకుండా, బిజెపి ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ లో ఉంటారని ఎంపీ తేజస్వి సూర్య పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల సన్నాహాలు ఇప్పుడు ప్రారంభించలేదని చెప్పిన బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ గత ఐదేళ్ళ కాలంగా బిజెపి ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించిందని స్పష్టం చేశారు . బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ పార్టీ 200కు పైగా సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
గత ఐదేళ్ళుగా బీజేపీ నేతలు కష్టపడుతున్నారు : బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్
ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వందల కన్నా తక్కువ సీట్లు వచ్చే ప్రసక్తే లేదని, గత ఐదేళ్లుగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేతలు కష్టపడుతున్నారని దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు. దశల వారీగా ఏర్పాట్లలో ముందుకు సాగామని, లోక్సభ ఎన్నికలలో మెరుగైన ఫలితాలను సాధించామని 2021 అసెంబ్లీ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని పేర్కొన్నారు. 2019 లో రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాల్లో 18 స్థానాలను గెలుచుకున్న బిజెపి, రాష్ట్రంలో బలంగానే విస్తరించిందని వారు అభిప్రాయపడ్డారు .
8 దశల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు .. హోరాహోరీ పోరు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27 మరియు ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది దశల్లో జరుగుతాయి. ఇది ఇప్పటివరకు దేశంలోనే ఎక్కువ రోజులపాటు సాగుతున్న ఎన్నికలు. గత వారం ఎన్నికల తేదీలను ప్రకటించగా, రాజకీయ హింస భయంతో బెంగాల్లో ఎన్నికలు ఒక నెలలో దశలవారీగా చేపట్టామని ఎన్నికల సంఘం సూచించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ప్రశ్నిస్తూ మమతా బెనర్జీ బిజెపి ప్రధాన ఎన్నికల ప్రచారకర్త అయిన ప్రధాని నరేంద్ర మోడీ ఒత్తిడి మేరకు ఇది జరిగిందని ఆరోపణలు గుప్పించారు.