మోడీ చెప్పిందేంటీ? బీజేపీ మహిళా మోర్చా చీఫ్ చేసిందేంటీ?: గాల్లో కాల్పులు..కరోనాకు బెదిరింపుగానట
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటను కూడా లెక్కచేయలేదా మహిళా మోర్చా నాయకురాలు. ఇంట్లో లైట్లను ఆర్పివేసి, గుమ్మం ముందు దీపాలను వెలిగించాలంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని చేసిన సూచనను గాలికి వదిలేశారు. దీపాలను వెలిగించడానికి బదులుగా.. తుపాకితో గాల్లో కాల్పులు జరిపారు. గాల్లోకి కాల్పులు జరపడం ద్వారా కరోనా వైరస్ బెదిరిపోతుందంటూ ఆమె మద్దతుదారులు వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ మహిళా నాయకురాలిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
కొద్దిగా ఊరట: ఏపీలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల్లో భారీగా తగ్గుదల: ఈ సారి 14.. 266కు టచ్..!
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని బలరాంపూర్లో చోటు చేసుకుంది. ఆ మహిళా నాయకురాలి పేరు మంజు తివారీ. బలరాంపూర్ నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు. దేశవ్యాప్తంగా కమ్ముకుంటోన్న కరోనా వైరస్ను ఎదుర్కొనడంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లను ఆర్పివేసి, దీపాలను వెలిగిస్తోన్న సమయంలో మంజు తివారీ దీనికి భిన్నంగా వ్యవహరించారు.
తన లైసెన్స్డ్ రివాల్వర్తో గాలిలో కాల్పులు జరిపారు. తన ఇంటి డాబా మీద మొదట దీపాలను వెలిగించిన ఆమె అనంతరం గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ దృశ్యాన్ని ఆమె భర్తే సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించినట్లు చెబుతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట చేశారు. దీపాలను వెలిగించిన తరువాత కరోనా వైరస్ను పారద్రోలడానికి.. అంటూ ఓ కామెంట్ను దానికి జోడించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వీడియో వైరల్గా మారిన వెంటనే కొందరు స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆమె రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ ముగిసిన తరువాత రివాల్వర్ను అందజేస్తామని బలరాంపూర్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రధాని మోడీ చెప్పిందేంటీ? నువ్వు చేసిందేంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీ విజ్ఙప్తి మేరకు దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి దీపాలను వెలిగించగా.. సొంతపార్టీ నాయకురాలు ఇలా ప్రవర్తించడం సరికాదని అంటున్నారు.