గుజరాత్లో మా పార్టీ ఓడిపోతుంది: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించడం ఖాయమని ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. 182 స్థానాలలో కనీసం 100 నుంచి 120 సీట్లు రావడం ఖాయమని ఎక్కువ సర్వేలు వెల్లడించాయి. ఒకటి రెండు సర్వేలు వందలోపు సీట్లు వచ్చినా గెలుపు ఖాయమని చెబుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నేత ఒకరు తమ పార్టీ ఓడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేత ఇలా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. గుజరాత్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పాయని, కానీ మా పార్టీ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు చేసింది బీజేపీ రాజ్యసభ సభ్యులు సంజయ్ కాకడే. ప్రచారంలో బీజేపీ ఉపయోగించిన మతతత్వమే ఓటమికి కారణం కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. దాదాపు 75 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినట్లు తాను చేసిన సర్వేలే తేలిందని చెప్పారు.
గుజరాత్లో ఓబీసీలు, ముస్లీంలు, పటేల్ సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిందని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక గుజరాత్ సమస్యలపై దృష్టి పెట్టకపోవడం కూడా ఓటమికి ఓ కారణమని చెప్పారు.