రూ.1.16 లక్షలు తీసుకొని మోసం: ఒక్కో టికెట్ ధర మూడింతలు, బీజేపీ నేత నిర్వాకం..? కేసు
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగడంతో వలసకూలీలు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యేక రైళ్లు వేస్తామని ప్రభుత్వాలు చెబుతోన్నా.. కొన్ని చోట్ల మాత్రం కూలీల పాలిట శాపంగా మారింది. గుజరాత్లో అధికార పార్టీకి చెందిన నేత ఒకరు కూలీల నుంచి రూ. లక్ష వరకు వసూల్ చేశాడు. టికెట్లు ఇస్తానని చెప్పి.. మోసం చేశాడు. టికెట్ ఇవ్వమని అడిగితే దాడిచేయడంతో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. బీజేపీ నేత తీరును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది.
సూరత్కి చెందిన రాజేశ్ వర్మ.. బీజేపీ నేత అని చెబుతుంటారు. ఫేస్బుక్లో బీజేపీ నేత అని, ఆ పార్టీ నేతలతో దిగిన ఫోటోలు పెట్టుకున్నారు. అయితే జార్ఖండ్కి చెందిన కొందరు కూలీలు టికెట్ కోసం రాజేశ్ను ఆశ్రయించారు. వాసుదేవ్ వర్మ అనే కూలీ 100 మంది టికెట్ల కోసం రూ.1.16 లక్షలను రాజేశ్ వర్మకు కూడా ఇచ్చాడు. అయితే టికెట్లు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చింది. ఒక్కో టికెట్కు మూడింతల ధర ఇవ్వమని కోరడంతో గొడవ జరిగింది.
వాసుదేవ్ వర్మ... రాజేశ్ను కలిసి టికెట్ల విషయం చర్చించారు. మూడింతల ధర ఇవ్వాల్సిందేనని.. లేదంటే రూ.2 వేలకు ఒక్కో టికెట్ విక్రయిస్తానని బెదిరించాడు. తర్వాత వాసుదేవ్పై కర్రలతో దాడి చేశారు. దీంతో అతని మెదడు భాగంలో గాయమైంది. తన మైండ్ పనిచేయడం లేదు అని వాసుదేవ్ పేర్కొన్నారు. దాడి చేసే సమయంలో తీసిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. బీజేపీ నేతల అరాచకాన్ని ఎండగట్టింది.
Recommended Video
రాజేశ్ వర్మకు బీజేపీతో సంబంధం లేదని సూరత్ బీజేపీ స్పష్టంచేసింది. రాజేశ్ వర్మపై కేసు నమోదు చేశామని సూరత్ పోలీసులు తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజేశ్ వర్మ.. బీజేపీ నేత అని ఆరోపిస్తోంది.