ఆగని హింస : బెంగాల్లో బీజేపీ కార్యకర్త హత్య, టీఎంసీ మంత్రి కాన్వాయ్ అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
కోల్ కతా : లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. బెంగాల్ బీజేపీ ప్రాబల్యం చూపడంతో టీఎంసీ జీర్ణించుకోలేకపోతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామని బీజేపీ నేతలు కవ్విస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఓ బీజేపీ కార్య హత్యతో పరిస్థితి మరింత ముదిరినట్టే కనిపిస్తోంది.
బీజేపీ కార్యకర్త హత్య
ఉత్తర 24 పరగణ జిల్లాకు చెందిన చాందన్ షా అనే బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. తన టూ వీలర్పై వెళ్తుండగా దుండగులు చాందన్పై కాల్పులు జరిపి పరారయ్యాడు. దీంతో జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా భారీ పోలీసు బలగాలను మొహరించారు. మరోవైపు బెంగాల్లో కేంద్రమంత్రి కాన్వాయ్పై టీఎంసీ కార్యకర్తలు దాడిచేసిన సంగతి తెలిసిందే.
కాన్వాయ్ అడ్డుకున్న వైనం ..
ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు కూడా దాడులకు దిగారు. నిన్న రాత్రి బెంగాల్ అటవీశాఖ మంత్రి బినాయ్ కృష్ణ బర్మాన్ కాన్వాయ్ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే పోలీసులు కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది. దీంతోపాటు దిన్హాటా, కూచ్ బెహర్, పహర్ పూర్, జల్పైగురి, గంగరంపూర్ దక్షిన్ దింజాపూర్ జిల్లాలో ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను మొహరించారు.
జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం
బక్తపుర, కకిన్ పు, ఉత్తర 24 పరగణ జిల్లాల్లో పరిస్థితి దృష్టా అదనపు బలగాలను మొహరించినట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు గొడవకు సంసిద్ధులవుతారని .. అందుకే ఎక్కువ బలగాలను మొహరించినట్టు వివరించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు, టీఎంసీ 22 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు అమేథీలో స్మృతీ ఇరానీ అనుచరుడిని మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. మృతుడి కుటుంబసభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలపైనే అనుమానం వ్యక్తం చేశారు.