బర్త్ డే పార్టీలో ఊహించని ఘటన : బీజేపీ కార్యకర్త దారుణ హత్య..
కర్ణాటకలోని మైసూరులో ఉన్న కువెంపునగర్లో ఓ బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. తన బర్త్ డే వేడుకల్లోనే అతను హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు హత్యకు పాల్పడ్డారని కొంతమంది చెబుతుండగా.. బర్త్ డే పార్టీలో జరిగిన గొడవనే హత్యకు దారితీసిందని మరికొందరు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
స్నేహితులకు బర్త్ డే పార్టీ ఇచ్చిన ఆనంద్..
మైసూరులోని జనతానగర్కి చెందిన బీజేపీ స్లమ్ మోర్చా సభ్యుడు ఆనంద్ గురువారం రాత్రి తన బర్త్ డే సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. కువెంపునగర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంటులో పార్టీ జరిగింది. ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ శుక్రవారం తెల్లవారుజామున ఆనంద్ హత్యకు గురయ్యాడు. పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రత్యర్థుల పనేనా..?
శుక్రవారం తెల్లవారుజామున 3 లేదా 4గంటల సమయంలో హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. ఆనంద్ గతంలో రౌడీ షీటర్ అని.. కొన్నేళ్ల క్రితం జనతానగర్లో జరిగిన హత్య కేసులో అతని ప్రమేయం కూడా ఉందని చెప్పారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని... ఆనంద్ ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని కొంతమంది చెబుతుండగా.. పార్టీలో జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసి హత్య జరిగిందని మరికొందరు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కమిషనర్ చంద్రగుప్తా తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
మరో ఘటనలో కార్పోరేట్పై హత్యాయత్నం
మైసూరులోనే జరిగిన మరో ఘటనలో రజనీ అన్నయ్య అనే మాజీ కార్పోరేటర్పై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి ఆ కార్పోరేటర్ యరగనహల్లికి వెళ్లగా.. ఇద్దరు యువకులు ఆయనపై మారణాయుధాలతో దాడి చేశారు. అక్కడే ఉన్న జనం నిందితుల్లో ఒకరైన మహదేవ్ను పట్టుకున్నారు. మరొక యువకుడు అక్కడినుంచి పరారయ్యాడు. ప్రస్తుతం రజనీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.