దారుణం : స్మృతి ఇరానీ అనుచరుడ్ని కాల్చి చంపారు..
అమేథీ : ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. అమేథీలో ఓ బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బీజేపీ నేత స్మృతి ఇరానీ అనుచరుడైన బరోలియా గ్రామానికి సురేంద్ర సింగ్ దుండగుల కాల్పుల్లో మతి చెందాడు. అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తెల్లవారుజాము 3గంటల సయంలో సురేంద్రసింగ్ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను లక్నోలోని హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. సురేంద్ర హత్యకు సంబంధించి పోలీసులు కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పాతకక్షలు, రాజకీయ వివాదాలే హత్యకు దారి తీసి ఉంటాయని అమేధీ ఎస్పీ రాజేష్ కుమార్ చెప్పారు. హత్య కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
యూపీలో దారుణం: అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు ..బోరుబావిలో శవమై ప్రత్యక్షం
బరోలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ గతంలో సర్పంచ్గా పనిచేశారు. బీజేపీ కార్యకర్త అయిన ఆయన సర్పంచ్ పదవికి రాజీనామా చేసి మరీ సార్వత్రిక ఎన్నికల్లో స్మృతి ఇరానీ విజయం కోసం అలుపెరగకుండా శ్రమించారు. అందుకుగానూ ఆమె నుంచి ఎన్నికల ప్రచార సభ వేదికలపై ప్రశంసలు అందుకున్నారు. సురేంద్రసింగ్, బీజేపీ నేత స్మృతికి అత్యంత విశ్వాసపాత్రుడని గ్రామస్థులు చెబుతున్నారు. సురేంద్ర మృతిపై స్మృతి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.