బెంగాల్లో దీదీ వర్సెస్ బీజేపీ : మమతకు గెట్ వెల్ సూన్ కార్డులు పంపనున్న కాషాయపార్టీ
కోల్కతా : బెంగాల్లో తృణమూల్ వర్సెస్ బీజేపీ మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోంది. జై శ్రీరాం నినాదాలపై సీఎం మమతాబెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేయడం.. బీజేపీ కార్యకర్తలు ఆమె కనిపించినప్పుడల్లా అవే నినాదాలతో హోరెత్తించడం పరిపాటిగా మారింది. నిరసనలో భాగంగా జై శ్రీరాం అని రాసిన పోస్టు కార్డులను దీదీకి పంపిన బీజేపీ కార్యకర్తలు తాజాగా మరో రూపంలో నిరసనకు సిద్ధమయ్యారు. బీజేపీ చర్యకు ప్రతిచర్యగా తృణమూల్ నేతలు ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్ల ప్రొఫైల్ పిక్చర్లు మార్చుకున్నారు.
జై శ్రీరాం నినాదం మతానికి సంబంధించింది...! అందుకే వ్యతిరేకిస్తున్నా...! మమతా బెనర్జీ
దీదీకి గెట్ వెల్ సూన్ కార్డులు
జై శ్రీరాం నినాదాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేయడంపై కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఘాటుగా స్పందించారు. దీదీ ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేశారు. జైశ్రీరాం అనే పదం వినగానే మమత కోపంతో ఊగిపోతుండటం కచ్చితంగా ఆమెకు ఏదో సమస్య ఉందనడానికి నిదర్శనమని బాబుల్ సుప్రియో అభిప్రాయపడ్డారు. తన నియోజకవర్గం అసన్సోల్ ప్రజల తరఫున మమత బెనర్జీకి గెట్ వెల్ సూన్ కార్డులు పంపనున్నట్లు ప్రకటించారు.
మమత వైఖరి సరికాదు
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మమత బెనర్జీ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదని చెప్పారు. పదవి హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆమెపై ఉందని బాబుల్ సుప్రియో హితవు పలికారు. దీదీ కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు.
డీపీలు మార్చుకున్న తృణమూల్
మరోవైపు బీజేపీ నేతల తీరుపై బెంగాల్ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాజకీయాలకు మతం రంగు పులిమి అశాంతికి కారణమవుతుందని ఆరోపించారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆమె పోస్ట్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తృణమూల్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్ల ప్రొఫైల్ పిక్చర్ మార్చారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరులతో పాటు జై హింద్, జై బంగ్లా నినాదాలున్న ఫొటోలను డీపీగా పెట్టారు. తృణమూల్ నేతలు సైతం బై హింద్, జై బంగ్లా నినాదాలున్న ఫొటోలను తమ సోషల్ మీడియా అకౌంట్ల డిస్ ప్లే పిక్చర్లుగా పెట్టుకున్నారు.