బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యే కోసం పోలింగ్ నిలిపేశారు, దౌర్జన్యం, అరెస్టు, పాపం ఓట్ల కోసం!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని హెబ్బాళ శాసన సభ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వై.ఏ. నారాయణస్వామి పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చే వరకు ఎవరూ ఓటు వెయ్యరాదని ఆ పార్టీ కార్యకర్తలు ఓటర్లను అడ్డుకున్నారు. ఎన్నికల అధికారుల మీద దౌర్జన్యం చేసిన బీజేపీ కార్యకర్తలు అరెస్టు అయ్యారు. పోలీంగ్ కేంద్రం దగ్గరకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే వైఏ. నారాయణస్వామి తనకే ఓటు వెయ్యాలని మనవి చేస్తున్న సమయంలో జేడీఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పోలింగ్ కేంద్రం
శాసన సభ ఎన్నికల సందర్బంగా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల దూరం నిషేధాజ్ఞలు విధించారు. శనివారం హెబ్బాళ బీజేపీ ఎమ్మెల్యే, ఆపార్టీ అభ్యర్థి వైఏ. నారాయణస్వామి పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలో నిలబడి ఉన్న ఓటర్ల దగ్గరకు వెళ్లి మా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మనవి చేశారని తెలిసింది.
జేడీఎస్ నాయకులు ఫైర్
బీజేపీ ఎమ్మెల్యే వైఏ. నారాయణస్వామి ఎన్నికల నియమాలు ఉల్లంఘించి నేరుగా పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్లి ఓట్లు వెయ్యాలని మనవి చేస్తున్న విషయం గుర్తించిన జేడీఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు, ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పోలీసులు ఎంట్రీ
బీజేపీ ఎమ్మెల్యే వైఏ. నారాయణస్వామి, జేడీఎస్ నాయకుల మద్య వాగ్వివాదం జరగడం, ఇరు పార్టీల కార్యకర్తలు గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం గుర్తించిన పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి పోలింగ్ సవ్యంగా జరగడానికి చర్యలు తీసుకున్నారు.
ఎమ్మెల్యే కోసం పోలింగ్ నిలిపేశారు
బెంగళూరులోని హెబ్బాళలో శనివారం ఉదయం ఓటు వెయ్యడానికి స్థానికులు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు ఓటర్లను అడ్డుకున్నారు. మా ఎమ్మెల్యే వచ్చి ఓటు వేసిన తరువాత మీరు ఓటు వెయ్యాలని బీజేపీ కార్యకర్తలు హంగామా చేశారు.
ఎన్నికల అధికారులపై దౌర్జన్యం
పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చి ఓటు వెయ్యాలని ఎన్నికల అధికారులు ఓటర్లకు సూచించారు. ఆసమయంలో మళ్లీ బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకుని ఎన్నికల అధికారుల మీద దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే వచ్చే వరకు వేచి ఉండాలని పట్టుబట్టారు. పరిస్థితి విషమించడంతో హెబ్బాళ పోలీసులు ఎన్నికల అధికారుల మీద దౌర్జన్యం చేశారని బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ గొడవ కారణంగా హెబ్బాళలో ఆలస్యం పోలింగ్ ప్రారంభం అయ్యింది.