సా.5గంటల నుంచే సంబరాలు, అందాక ఓపికగా ఉండండి: ధీమాగా యడ్యూరప్ప
Recommended Video
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప బలనిరూపణ పరీక్షలో తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం యడ్యూరప్ప శాసనసభలో బలపరీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే.
కర్ణాటక బలనిరూపణ: ఇలా చేస్తే బీజేపీదే అధికారం, కీలక మార్గాలివే
ఈ సందర్భంగా బలపరీక్షపై సీఎం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. బలపరీక్షలో నెగ్గి తామే అధికారాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సాయంత్రం 4గంటలకు జరగనున్న బలపరీక్షలో బీజేపీ బలం నిరూపించుకుంటుందని అప్పటి వరకు బీజేపీ కార్యకర్తలు, కర్ణాటక ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఆ తర్వాత వేడుకలు చేసుకోవచ్చని అన్నారు.
శనివారం సాయంత్రం 5గంటల నుంచి సంబరాలు మొదలవుతాయని సీఎం యడ్యూరప్ప చెప్పారు. అంతేగాక, ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. రైతు రుణాల మాఫీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, పింఛన్లను రూ.600 నుంచి 1200 రూపాయలకు పెంచడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కాగా, బీజేపీకి 104మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో 105కి చేరింది. ఇక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు కలిసి మొత్తం 116మంది ఉన్నారు. అయితే, తమకు 120మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ ఇప్పటికే ప్రకటించడంతో బలనిరూపణపై ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎమ్మెల్యేలు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబడతారనే విషయం శనివారం సాయంత్రం 4గంటల తర్వాతే తేలనుంది.