సాధ్వీకి టికెట్ ఇవ్వాల్సింది కాదు : అతావలే
భోపాల్ : భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. ఆమె కామెంట్లపై ప్రతిపక్షాలే కాదు.. మిత్రపక్షాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరేపై సాధ్వీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి రామ్దాస్ అతావలే స్పందించారు. ఆమె కామెంట్లను తీవ్రంగా ఖండించారు.
బెంగాల్లో పరిస్థితి ఉద్రిక్తం.. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కారు ధ్వంసం..
మాలేగావ్ కేసులో సాధ్వీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు
మాలేగావ్ కేసులో హేమంత్ కర్కరే తనను ఇబ్బంది పెట్టారన్న సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల్ని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, కేంద్రమంత్రి రామ్దాస్ అతావలే తోసిపుచ్చారు. ఆమెకు ఆ పేలుళ్లతో సంబంధం ఉందనడానికి తగిన సాక్ష్యాలు ఉన్నందునే కర్కరే సాధ్వీని అరెస్ట్ చేశారని చెప్పారు. ఈ విషయంలో తప్పొప్పులను కోర్టే నిర్ణయిస్తుందని అతావలే అభిప్రాయపడ్డారు.
టికెట్ ఇవ్వాల్సింది కాదు
సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ను బీజేపీ భోపాల్ నుంచి బరిలో నిలపడంపై రామ్దాస్ అతావలే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ పొరపాటు చేసిందని అన్నారు. ఒకవేళ సాధ్వీని బరిలో నిలిపే అంశంపై నిర్ణయాన్ని తమకు వదిలేసి ఉంటే.. ఆమెకు టికెట్ ఇచ్చే వారమే కాదని స్పష్టం చేశారు.
ఎన్డీఏకు 350 సీట్లు ఖాయం
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయఢంకా మోగించడం ఖాయమని అతావలే ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలు 350 సీట్లు గెలుచుకుంటాయని అన్నారు. రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం మోడీ తనకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.