మమతా తల నరికి తెచ్చినవారికి రూ.11లక్షలు: బీజేవైఎం నేత సంచలనం..
ఏకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తల నరికినవారికి రూ.11లక్ష బహుమతి ఇస్తామంటూ బీజేవైఎం నాయకుడు యోగేష్ ప్రకటించారు.
కోల్కతా: ఈమధ్య కాలంలో బీజేపీ నేతల నోటివెంట 'తలలు నరకండి' అన్న పదం తరుచుగా వినిపిస్తోంది. మొన్నటికి మొన్న శ్రీరామ నవమి సందర్బంగా హైదరాబాద్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. రామమందిర నిర్మాణానికి అడ్డుపడినవారి తలలు నరికేస్తామని వివాదస్పద రీతిలో రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
రాజాసింగ్ వ్యాఖ్యలపై ఓవైపు చర్చ జరుగుతుండగానే మరో బీజేవైఎం(భారతీయ జనతా యువమోర్చా) నాయకుడు యోగేష్ వార్ష్నే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తల నరికినవారికి రూ.11లక్ష బహుమతి ఇస్తామంటూ ప్రకటించారు. బిర్బమ్ జిల్లాలో హనుమాన్ జయంతి సందర్బంగా నిర్వహించిన శోభాయాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, భద్రతా కారణాల రీత్యా హనుమాన్ శోభాయాత్రకు బెంగాల్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. అయినా సరే రోడ్ల పైకి వచ్చిన కొంతమంది భక్తులు 'జై శ్రీరామ్' అంటూ రోడ్లపై ఎత్తున నినాదాలు చేయడం.. కొద్దిపాటి గందరగోళం నెలకొనడంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. దీనిపై మండిపడుతూ మమత తల నరికి తెచ్చినవారికి 11 లక్ష రూపాయల బహుమతి ఇస్తానని యోగేష్ ప్రకటించారు.
సీఎం మమతా బెనర్జీ ముస్లింలకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని యోగేష్ ఆరోపించారు. సరస్వతి పూజ, రామ నవమి లాంటి వాటికి మమతా మద్దతు ఉండదని, ఇఫ్తార్ విందులను మాత్రం మమతే స్వయంగా నిర్వహిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.