బీజేపీ యువ నేత పమేలా గోస్వామికి పోలీస్ కస్టడీ: కొకైయిన్ లభించడంతోనే అరెస్ట్..
డ్రగ్స్ కేసులో బీజేపీ యువమోర్చా నేత పమేలా గోస్వామికి స్థానిక కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 25వ తేదీ వరకు ఆమె పోలీసు కస్టడీలోనే ఉంటారని కోల్కతాలోని ఎన్డీపీఎస్ కోర్టు తెలిపింది. పమేలా గోస్వామి డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణపై శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాన్ని సీఐడీతో విచారణ జరిపించాలని పమేలా డిమాండ్ చేస్తున్నారు.
తనపై ప్రణాళకి ప్రకారం కుట్ర జరిగిందని పమేలా ఆరోపించారు. బీజేపీ ఎంపీ రాకేశ్ సింగ్ తనకు మొక్కలు పంపించారని.. అయితే అందులో కొకైయిన్ ఉందని పేర్కొన్నారు. మొక్కలు పంపించిన వాహనంలో డ్రగ్స్ దొరకడం ఏంటీ అని అడిగారు. అయితే పమేలా ఆరోపణలపై రాకేశ్ స్పందించారు. తన పేరు చెడగొట్టేందుకే ఆమె ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. గత వారంలో సీనియర్ బీజేపీ నేతలపై కూడా ఇదేవిధంగా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. అంతేకాదు ఆమె సొంత తండ్రే డ్రగ్స్ తీసుకుంటున్నావని ఫిర్యాదు చేసిన విషయాన్ని పేర్కొన్నారు.
అయితే పమేలా చాలా మంచిదని తల్లి మధుచంద్ర ఘోష్ ఇండియా టుడే వార్తాసంస్థకు తెలుపడం విశేషం. తాను చలా మంచిదని.. తాము మధ్యతరగతికి చెందినవారమని తెలిపారు. గతంలో ఎప్పుడూ కొకైయిన్ తీసుకున్న సందర్భాలు లేవు అని చెప్పారు. అయితే పమేలా ఇంటిలో 100 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆమె కారు సీటులో గల బ్యాగు నుంచి కొకైయిన్ లభించిందని తెలిపారు. డ్రగ్స్ కేసులో పమేలా స్నేహితుడు ప్రొబిర్ కుమార్ దేవ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.