ఢిల్లీలో బీజేపీ ఓడిపోవడం నితీశ్కు సంతోషం కలిగించిందా.. ఇదీ అసలు లెక్క..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలను దక్కించుకుని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేసింది. బీజేపీ కేవలం 8 స్థానాలకు పరిమితమైంది. బీజేపీతో కలిసి బరిలో దిగిన మిత్రపక్షాలు జేడీయూ,ఎల్జేపీ ఖాతా తెరవలేదు. జేడీయూ రెండు స్థానాల్లో పోటీ చేయగా.. రెండు చోట్లా భారీ తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ ఎన్నికల్లో బీహార్ మిత్రపక్షాలతో కలిసి బీజేపీ పోటీ చేయడం ఇదే తొలిసారి. మొత్తం మీద ఆప్ హవాతో కేజ్రీవాల్ మరోసారి సీఎం పీఠాన్ని చేజిక్కించుకున్నారు. అయితే కేజ్రీవాల్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి రావడం బీహార్ ముఖ్యమంత్రి,జేడీయూ అధినేత నితీశ్ కుమార్కు కూడా లోలోపల సంతోషం కలిగిస్తుండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్డీయేపై నితీశ్ అసంతృప్తి
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్లో బీజేపీ,జేడీయూ,ఎల్జేపీ పొత్తుతో బరిలో దిగాయి. మొత్తం 40 పార్లమెంట్ స్థానాలకు గాను బీజేపీ 17,జేడీయూ 17,ఎల్జేపీ 6 స్థానాల్లో పోటీ చేశాయి. ఇందులో బీజేపీ 17కి 17 స్థానాలు గెలవగా,జేడీయూ 16,ఎల్జేపీ 6 స్థానాలు గెలిచాయి. అయితే మోదీ ప్రభంజనం కారణంగానే బీహార్లోనూ గెలిచామని బీజేపీ ప్రచారం చేసుకోవడం నితీశ్కు నచ్చలేదు. అదీగాక బీజేపీతో ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్ షేరింగ్ విషయంలో ఆయన అసంతృప్తితోనే ఉన్నారు.మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. కేంద్ర కేబినెట్లో తమ పార్టీ నుంచి ఒక్కరికే స్థానం కల్పించడం కూడా నితీశ్కు నచ్చలేదు. కనీసం రెండు పదవులైనా దక్కుతాయనుకుంటే.. కేవలం ఒకరికే కేబినెట్లో స్థానం కల్పించడం ఆయన్ను అసంతృప్తికి గురిచేసింది. అందుకే భవిష్యత్తులోనూ ఎన్డీయే కేబినెట్లో భాగస్వామ్యం కాబోమని నితీశ్ తేల్చి చెప్పారు.
అప్పటికీ ఇప్పటికీ తేడా..
నితీశ్ మొదటిసారి 1996లో బీజేపీతో చేతులు కలిపారు. 2013వరకు బీజేపీ మిత్రపక్షంగానే కొనసాగారు. ఎన్డీయే నుంచి బయటకొచ్చాక ఆర్జేడీ,కాంగ్రెస్లతో కలిసి మహాఘట్బంధన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2017లో మహాఘట్బంధన్ నుంచి బయటకొచ్చి మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు. అయితే ఒకప్పుడు ఎన్డీయేలో నితీశ్కు లభించిన హోదాకు,ఇప్పటి హోదాకు చాలా తేడా ఉంది. ముఖ్యంగా ప్రధాని మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో సంబంధాలు తేడా కొట్టాయి.
మారిన సమీకరణాలు...
ఒకప్పుడు ఎన్డీయేలో నితీశ్ సీనియర్ భాగస్వామి. సీట్ల షేరింగ్ విషయంలో ఆయన మాటకే ప్రాధాన్యం ఎక్కువగా ఉండేది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా ప్రకారం కాకుండా జేడీయూనే ఎక్కువ సీట్లలో పోటీ చేసేది. 2009 ఎన్నికల్లో జేడీయూ 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా.. బీజేపీ 15 స్థానాల్లో పోటీ చేసింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 141 స్థానాల్లో పోటీ చేయగా బీజేపీ 102 స్థానాల్లో పోటీ చేసింది. కానీ 2014 ఎన్నికలతో సీన్ మారిపోయింది. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జేడీయూ బొక్కబోర్లా పడింది. మరోవైపు బీజేపీ 22 స్థానాలు గెలుచుకుంది. దీంతో 2017లో నితీశ్ తిరిగి ఎన్డీయేలో చేరాక.. ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్ షేరింగ్ ఫార్మూలాకు ఒప్పుకోక తప్పలేదు.
నితీశ్కు చిక్కిన అవకాశం..
తాజా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందితే.. బీహార్లో ఎక్కడ ఎక్కువ సీట్లు అడుగుతుందోనన్న ఆందోళన నితీశ్లో ఉంది. అయితే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో సీట్ల షేరింగ్ విషయంలో తాము గట్టిగా పట్టుబట్టవచ్చునని నితీశ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జేడీయూకే ఎక్కువ సీట్లు దక్కేలా.. అదీ తమకు కావాల్సిన నియోజకవర్గాలను ఎంచుకున్న తర్వాతే మిగతా సీట్లను బీజేపీకి ఇచ్చేలా నితీశ్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ ఢిల్లీ ఎన్నికలు తారుమారై ఉంటే.. బీహార్లో బీజేపీ ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్ షేరింగ్ కోసం నితీశ్ను పట్టుబట్టేదన్న చర్చ కూడా జరుగుతోంది.