‘505 బిలియన్ డాలర్ల నల్లధనం తరలిపోయిందా?’
న్యూఢిల్లీ: 2004-13 మధ్య కాలంలో 505 బిలియన్ డాలర్ల నల్లధనం దేశం దాటి తరలిపోయిందా? అంటూ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)ని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణ బృందం (సిట్) ప్రశ్నించింది.
దేశం నుంచి తరలిపోతున్న నల్లధనంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ గ్లోబల్ ఫైనాన్స్ ఇంటిగ్రిటి నివేదిక ప్రకారం ప్రపంచంలో వివిధ దేశాల నుంచి తరలిపోతున్న నల్లధనం విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.
2004-2013 మధ్య కాలం(కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్న కాలం)లో యేటా దేశం నుంచి 51 బిలియన్ డాలర్ల నల్లధనం విదేశాలకు తరలిపోయింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటి నుంచి దేశాల వారీగా నల్లధనానికి సంబంధించిన లెక్కలను సిట్ బృందం సేకరించింది.
ఆయా సంవత్సరాల్లో నల్లధనం ఎంత తరలిపోయిందో వివరాలు అందులో ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ వివరాలను డీఆర్ఐకి ఫిబ్రవరి 8న పంపామని, అవి సరైనవో కాదో తేల్చమని కోరినట్లు వివరించింది. డీఆర్ఐ నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సిట్ వెల్లడించింది.
కాగా, నరేంద్ర మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచనల మేరకు 2014లో నల్లధనంపై విచారణ కోసం సిట్ను నియమించింది. నల్లధనం వెనక్కి తీసుకొస్తామని ఎన్నికల సమయంలో బిజెపి హామి ఇచ్చిన విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నల్లధనం వ్యతిరేక చట్టం తీసుకొచ్చింది. పన్నులు చెల్లించని వారిపై ఈ చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.