కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ను దోషిగా తేల్చిన కోర్టు, ఐదేళ్ల జైలు శిక్ష
Recommended Video
జోధ్పూర్: కృష్ణజింకలను వేటాడిన కేసులో నటుడు సల్మాన్ ఖాన్ను జోధ్పూర్ కోర్టు గురువారం దోషిగా తేల్చింది. అనంతరం మధ్యాహ్నం అతనికి ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. రూ.10వేల జరిమానా విధించింది. ఇరవై ఏళ్ల క్రితం (1998) నాటి కేసులో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మిగతా వారిని న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. 1998లో హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ సమయంలో కృష్ణ జింకలను వేటాడిన కేసు ఉంది.
రెండు కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడినట్లు రాజస్థాన్ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇప్పుడు అతనిని దోషిగా తేల్చింది. టబు, సోనాలీ బింద్రే, సైఫ్ అలీఖాన్, నీలంలను న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. సల్మాన్పై మొత్తం మూడు కేసులు ఉండగా... అక్రమ ఆయుధాల కేసులో ఆయనకు ఊరట లభించింది. ఈ కేసులో మాత్రం కోర్టు దోషిగా తేల్చింది.
రెండేళ్ల శిక్ష వేయాలని కోరిన లాయర్లు
సల్మాన్ ఖాన్ సామాజిక సేవను దృష్టిలో పెట్టుకొని ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష వేయాలని ఆయన తరఫు లాయర్లు కోర్టును కోరారు. వన్యప్రాణులను వేటాడిన కేసులో గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలుంటాయి. సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. సల్మాన్ ఖాన్తో పాటు ఇద్దరు చెల్లెళ్లు కోర్టుకు వచ్చారు. లోనికి ఒక్కరినే అనుమతించారు. సోదరి అల్విరా సోదరుడి బోను పక్కనే నిల్చుున్నారు.
సల్మాన్ కోసం జైలు శుభ్రం
సల్మాన్ ఖాన్ కోసం జైలును ముందే శుభ్రం చేశారు. ఆయన దోషిగా తేలితే జైలు శిక్ష పడే అవకాశముందని భావించి, జోధ్పూర్ జైలు అధికారులు ముందుగానే ఓ కారాగారాన్ని సిద్ధం చేశారని తెలుస్తోంది. కారాగారంలో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పారు.
జోధ్పూర్ సెంట్రల్ జైలులో సల్మాన్ కోసం ఓ కారాగారాన్ని శుభ్రం చేసి ఉంచామని, జైల్లో మరుగుదొడ్లు కూడా ఉన్నాయని, కానీ కూలర్, ఏసీ, ఫ్యాన్ లాంటి సదుపాయాలు లేవని సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ వెల్లడించారు.