కృష్ణ జింకల కేసులో నేడే తుది తీర్పు: సల్మాన్ భవితవ్యంపై ఉత్కంఠ?..
Recommended Video
జోథ్పూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ కృష్ణ జింకల కేసులో రాజస్థాన్ జోథ్పూర్ కోర్టు నేడు తుది తీర్పు ఇవ్వనుంది. సల్మాన్ను కోర్టు నిర్దోషిగా తేలుస్తుందా?.. లేక సంచలన తీర్పు ఏమైనా వెలువడుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.
కోర్టు తుది తీర్పు నేపథ్యంలో బుధవారం నాడే జోథ్పూర్ చేరుకున్నారు సల్మాన్. తీర్పు వెలువరించే సమయంలో.. సల్మాన్తో పాటు కేసులో ముద్దాయిలుగా ఉన్న సైఫ్ అలీఖాన్, టబు, సొనాలి బింద్రేలు కూడా కోర్టులో ఉండనున్నారు.
దాదాపు 20 ఏళ్లపాటు సాగిన ఈ కేసుకు సంబంధించి తుది వాదోపవాదనలు మార్చి 28న పూర్తయ్యాయి. న్యాయమూర్తి దేవ్ కుమార్ ఖత్రీ తీర్పును గురువారానికి రిజర్వ్లో ఉంచారు.
కాగా, 1998లో 'హమ్ సాత్ సాత్ హైన్' సినిమా షూటింగ్ సందర్భంగా జోథ్పూర్లోని కంకణి గ్రామంలో.. సల్మాన్, సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బింద్రే, టబు, నీలమ్.. స్థానికుల సహాయంతో కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదైంది.
సల్మాన్ పై సెక్షన్-51 వన్య ప్రాణి సంరక్షణ చట్టం, సెక్షన్ 149-చట్ట విరుద్ద కార్యకలాపాలపై కేసులు నమోదయ్యాయి. కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవాని సింగ్ భతీ మాట్లాడుతూ.. 'ఆరోజు రాత్రి వాళ్లంతా జిప్సీలో వెళ్తున్న సమయంలో.. సల్మాన్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తూనే రెండు జింకలను అతను గురిపెట్టి కాల్చాడు.' అని తెలిపారు.
అనంతరం ఆ జంతువులను అక్కడే వదిలేసి వారు పారిపోయినట్టు వెల్లడించాడు. దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని అన్నారు. మరోవైపు సల్మాన్ తరుపు న్యాయవాది హెచ్ఎం సరస్వతి మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారను. ప్రాసిక్యూషన్ చెబుతున్న మాటల్లో చాలావరకు లొసుగులు ఉన్నాయని, కేసును నిరూపించడంలో వారు విఫలమయ్యారని అంటున్నారు.