విపక్షాలపై నిందలేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదు: మన్మోహన్ సింగ్
అస్తమానం విపక్షాలపై నిందలు వేయడం వల్ల ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టలేరని హితవు పలికారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా రఘురాం రాజన్ ఉన్న సమయంలోనే ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. విపక్షాలపై నిందలు వేసే బదులు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మార్గాలను అన్వేషించాలని సూచించారు.
ప్రభుత్వ విధానాలతో ప్రజలకు ఇబ్బందులు
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముందుగా దాని సరిగ్గా అంచనావేసి లోటుపాట్లను తెలుసుకోవాలని చెప్పిన మన్మోహన్ సింగ్.. అది విపక్షాలను దుమ్మెత్తి పోయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని వెల్లడించారు. ప్రభుత్వ విధానాల వల్లే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని వీరు చేస్తున్న పొరపాట్లకు ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ తెలిపారు. డిమాండ్ తగ్గిపోవడంతో మహారాష్ట్రలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు.
మహారాష్ట్రలో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉంది
మహారాష్ట్రలో పారిశ్రామిక రంగం కుదేలైందని చెప్పిన మన్మోహన్ సింగ్... చైనా నుంచి విడిభాగాలను భారత్కు దిగుమతి చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. ద్వంద్వ ప్రభుత్వ విధానాలతో బీజేపీ విఫలమైందని ధ్వజమెత్తిన మన్మోహన్ సింగ్ ఓట్లను ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఆర్థిక వృద్ధి అత్యంత దారుణంగా పడిపోయిందని వరుసగా నాల్గవసారి ఇది పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని ఈ మాజీ ఆర్థికవేత్త మన్మోహన్ తెలిపారు. మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడంతో ఇక్కడ యువతకు కూడా ఉద్యోగాలు దొరకడం కష్టమైపోయిందని ... తక్కువ జీతాలకే యువత పనిచేయడం విచారకరమన్నారు మన్మోహన్ సింగ్.
రైతు ఆత్మహత్యల్లో తొలిస్థానం
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు మన్మోహన్ సింగ్. ఒకప్పుడు మహారాష్ట్ర పెట్టుబడుల్లో మొదటి స్థానంలో ఉంటే ఇప్పుడు రైతు ఆత్మహత్యల్లో తొలి స్థానంలో నిలిచిందని చెప్పారు. స్వతహాగా ఆర్థిక వేత్త అయిన మన్మోహన్ సింగ్... పెద్దనోట్ల రద్దు జీఎస్టీలతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని అప్పుడే చెప్పారు. అంతేకాదు కొన్ని పారిశ్రామిక రంగాలు నేలచూపులు చూడకముందే వాటికి చికిత్సను అందించాలని కూడా సూచించారు. అదే విషయాన్ని మన్మోహన్ మళ్లీ గుర్తు చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలంటే ఆర్థిక వ్యవస్థను పెంచడం కంటే మరోమార్గం లేదని చెప్పిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వ్యాపారాలను, పరిశ్రమలను ప్రోత్సహించాలని చెప్పారు.