మహారాష్ట్ర కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... ఇద్దరు మృతి,నలుగురికి తీవ్ర గాయాలు...
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న తారాపూర్ కెమికల్ జోన్లోని ఓ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం(అగస్టు 17) సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సాయంత్రం 7.30గంటల సమయంలో నందోలియా ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. పేలుడుకి కారణమేంటన్నది తెలియరానప్పటికీ... పేలుడు శబ్దం మాత్రం దాదాపు 10కి.మీ వరకూ వినిపించిందని బోయిసర్,పాస్తల్,సల్వాద్ గ్రామాల ప్రజలు తెలిపారు.
రియాక్టర్లో పేలుడు సంభవించి ఉంటుందని బోయిసర్ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కబ్సే వెల్లడించారు. మృతుల్లో ఒకరిని సందీప్ కుశ్వారాగా గుర్తించామన్నారు. గాయపడ్డవారిని ప్రమోద్ మిశ్రా(35),దిలీప్ గుప్తా(28),మహమ్మద్ అన్సారీ(31),ఉమేష్ కుశ్వారా(21)గా గుర్తించామన్నారు.
ఇటీవలి కాలంలో కెమికల్ ఫ్యాక్టరీల్లో పేలుడు ఘటనలు తరుచూ చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జూన్లో గుజరాత్లోని దహేజ్లో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో 8 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అదే జూన్లో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా... ఇద్దరు మహిళా కార్మికులు గాయపడ్డారు.
Recommended Video
ఈ ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకైన ఘటనలో దాదాపు 12 మంది మృతి చెందారు. వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత సాయినార్ లైఫ్ సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లోనూ గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి హెచ్డీఎస్ గ్యాస్ లీకవడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకు రాంకీ ఫార్మా సిటీలోనూ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ తర్వాత విశాఖ సాల్వెంట్ కంపెనీలోనూ పేలుళ్లు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు.
Maharashtra: Fire breaks out at Nandolia Organic Chemicals in Palghar. More details awaited. pic.twitter.com/Qurd40Nnc2
— ANI (@ANI) August 17, 2020