రాయ్పూర్ రైల్వే స్టేషన్లో పేలుడు .. నలుగురు సిఆర్పిఎఫ్ జవాన్లకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరో ఘటన చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారమ్ నంబర్ 2 వద్ద శనివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు సిఆర్పిఎఫ్ జవాన్లకు గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తంగా ఆరుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు గాయపడినట్లు సమాచారం. రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించటంతో ప్రయాణికులు ఉలిక్కి పడ్డారు. బ్లాస్టింగ్ జరిగింది సిఆర్పిఎఫ్ స్పెషల్ ట్రైన్ వద్ద కావటంతో ఒక్కసారిగా టెన్షన్ చోటు చేసుకుంది.
భారత్ లో 2 లక్షలకు చేరువగా కరోనా యాక్టివ్ కేసులు.. పండుగ ఎఫెక్ట్, తగ్గిన పరీక్షలు; తాజా లెక్కలివే !!
ఈ పేలుడు ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరికొందరు చికిత్స పొందుతున్నారని సమాచారం. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఉదయం 6:30 గంటల సమయంలో పేలుడు సంభవించిందని, రైల్వే స్టేషన్లోని సిఆర్పిఎఫ్ స్పెషల్ ట్రైన్లో ఇగ్నైటర్ సెట్ ఉన్న బాక్స్ నేలపై పడడంతో ఇది సంభవించిందని రాయ్పూర్ రైల్వే గుర్తించటంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన జవాన్లను రాయపూర్ లోని నారాయణ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జార్సుగూడ నుండి జమ్ముతావి వెళుతున్న రైలు ప్లాట్ నెంబర్ 2 మీద ఆగి ఉన్న సమయంలో ఈ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో దసరా వేడుకల్లో భక్తులపై నుంచి ఒక కారు దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. లఖింపూర్ ఖేరి ఘటన తరహాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జష్ పూర్ లో దసరా వేడుకలలో భక్తుల మీద కారు దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనం ఊరేగింపు జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ఓ కారు భక్తులపై నుండి దూసుకెళ్లింది.
Recommended Video
ఈ ఘటనతో కోపోద్రిక్తులైన భక్తులు కార్ లోని వ్యక్తులను చితకబాదారు. కారును తగలబెట్టారు. అయితే ఆ కార్ లో పెద్ద ఎత్తున గంజాయి లభించినట్లు సమాచారం. గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న క్రమంలోనే అనుమానంతో పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా తప్పించుకునే క్రమంలో కారులోని గంజాయి స్మగ్లర్లు కారును వేగంగా నడుపుతూ భక్తులపై దూసుకెళ్లినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నట్లు సమాచారం. నిన్న ఈ ఘటన మరిచిపోకముందే ఈరోజు, రైల్వే స్టేషన్ లో పేలుడు సంభవించి నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్ర గాయాల పాలయ్యారు.