తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో బాంబు పేలుడు, భార్య మృతి
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లోని బర్బహమ్ జిల్లాలో ఆదివారం ఉదయం తృణమూల్ కాంగ్రెస్కు చెందిన బూత్ కమిటీ నేత ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో బురో హన్సడా భార్య మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బర్బహమ్ జిల్లాలోని బిలాటీ గ్రామంలో తృణముల్ కాంగ్రెస్ నేత బురో హన్సడా (45) ఇంట్లో ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ బాంబు పేలుడు ప్రమాదం సంభవించిందని జిల్లా ఎస్పీ ముఖేష్ కుమార్ తెలిపారు. ఈ పేలుడు ఘటనలో హన్సడా భార్య చుర్కీ హన్సడా (37) తీవ్ర గాయాలు పాలయ్యారు.
వెంటనే ఆమెన సమీపంలోని బోల్పుర్ ఏరియా ఆసుపత్రికి తరలించే తరుణంలో మార్గం మధ్యలో మృతి చెందారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పేలుడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పేలుడు ఘటనపై ఎస్పీ మాట్లాడుతూ ప్రత్యర్ధి పార్టీల వారు ఈ ఘటనకు పాల్పడ్డారా, లేక ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తృణమూల్ కాంగ్రెస్ వర్గాల ఘర్షణ
పశ్చిమ బెంగాల్లోని అసాన్సాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఆదివారం ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం బాంబులతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో ముగ్గురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.