కొచ్చి షిప్ యార్డ్ లో పేలుడు: ఐదు మంది మృతి, ఓఎన్ జీసీ షిప్ లో, ఏం జరిగింది!
కొచ్చి: కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ లో మంగళవారం భారీ పేలుడు సంభవించి ఐదు మంది మరణించారు. 11 మందికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
మంగళవారం మద్యాహ్నం కొచ్చి షిప్ యార్డ్ లోని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ)కి చెందిన సాగర్ భూషణ్ షిప్ లో పేలుడు సంభవించింది. విషయం తెలుసుకున్న బాంబు నిర్వీర్యదళం, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు.
షిప్ లో మరమత్తులు చేసే వాటర్ ట్యాంక్ దగ్గర పేలుడు సంభవించిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. పేలుడుకు కచ్చితమైన సమాచారం తెలియడం లేదని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. షిప్ లకు మరమత్తులు చెయ్యడానికి కొచ్చి షిప్ యార్డ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ముందుజాగ్రత్త చర్యగా కొచ్చి షిప్ యార్డ్ ను తాత్కాలికంగా మూసివేశారు.