శభాష్ హమీద్: అమరజవాన్ల కుటుంబాలకు అంధుడైన ఈ సైంటిస్ట్ భారీ విరాళం
ముంబై: పుట్టుకతోనే చూపులేకుండా పుట్టాడు. అయితేనం కష్టపడి చదివి సైంటిస్టు అయ్యాడు. ఇప్పుడు మంచి మనసున్న వ్యక్తిగా కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..? అతను ఏం కనిపెట్టాడు..? మనసున్న వ్యక్తిగా ఎందుకు కొనియాడ బడుతున్నాడు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
శభాష్ ముర్తాజా హమీద్
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్త పేరు ముర్తాజా హమీద్. ముంబైకి చెందిన శాస్త్రవేత్త. ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారన్న విషయం తెలుసుకుని చాలా ఆవేదనకు గురయ్యాడు. దేశాన్ని శతృవుల నుంచి కాపాడుతున్న జవాన్లు ఇలా ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యారని తెలిసి ఎంతో దుఃఖించాడు. అందుకే అమరులైన జవాన్ల కుటుంబాలకు తనకు తోచినంత సహాయం చేయాలని భావించాడు. అక్కడి నుంచే ఓ మంచి ఆలోచన ముర్తాజా హమీద్కు తట్టింది.
అమరజవాన్ల కుటుంబానికి భారీ విరాళం
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి చేయడంతో అమరులైన జవాను కుటుంబాలకు తనవంతు సాయం చేయాలని భావించాడు ముర్తాజా. మొత్తం రూ.110 కోట్లు ప్రధానమంత్రి సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఆ మొత్తాన్ని అమరజవాన్ల కుటుంబాలకు అందజేయాలన్నదే తన కోరికని తెలిపారు. పుల్వామా దాడుల్లో 40 మంది మృతి చెందిన విషయం తనను ఎంతో బాధకు గురిచేసిందని చెప్పాడు. భారతీయులంతా ఒక్కటిగా ఉండి అమరజవాన్ల కుటుంబాలకు తమకు తోచినంత సహాయం చేయాలని ముర్తాజా హమీద్ పిలుపునిచ్చారు.
పాక్ దిగొచ్చింది: మసూద్ అజర్ సోదరుడు, బావమరిదిని అరెస్టు చేసిన పాకిస్తాన్
పుల్వామా తరహా దాడులు జరగకుండా టెక్నాలజీని కనిపెట్టిన హమీద్
ఇక విరాళంగా తాను ఇవ్వాలనుకున్నమొత్తం రూ.110 కోట్లు ఇప్పటికే ప్రాసెస్ అవుతోందని ముర్తాజా చెప్పారు. అదంతా తన కష్టార్జితం అని చెప్పారు. ఆ డబ్బులు టాక్సబుల్ ఇన్కమ్గా హమీద్ చెప్పారు.అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు అవకాశం ఇప్పించాలని ప్రధాని కార్యాలయానికి ఓ లేఖ కూడా రాశాడు హమీద్. మోడీని వ్యక్తిగతంగా కలిసి ఆ డబ్బును మొత్తాన్ని అందజేయాలనుందని తన కోరికను బయటపెట్టాడు.
కోటాకు చెందిన ముర్తాజా హమీద్, పుల్వామా తరహా దాడులు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఓ టెక్నాలజీని రూపొందించినట్లు వెల్లడించాడు. ఈ టెక్నాలజీ పేరు ఫ్యూయెల్ బర్న్ రేడియేషన్ అని చెప్పాడు. ఈ టెక్నాలజీ ద్వారా ఏదైనా వాహనం పేలుడు పదార్థాలను తీసుకెళుతుంటే పసిగట్టవచ్చని తద్వారా భారీ నష్టాన్ని నివారించవచ్చని చెప్పాడు. ఇంధనంతో ముడిపడి ఉన్న ఏ పేలుడు పదార్థమైనా పసిగట్టొచ్చని చెప్పారు. పేలుడు పదార్థాన్ని ఒక ఫ్యూజ్కు అనుసంధానం చేస్తే ఇక పేలుడును కనగొనొచ్చని వివరించారు. ఈ టెక్నాలజీని తాను మూడేళ్ల క్రితమే కనుగొన్నట్లు చెప్పిన హమీద్... ఈ వ్యవస్థను అప్పుడే తీసుకొచ్చి అమలు చేసి ఉంటే ఈరోజు పుల్వామా తరహా దాడులను నివారించగలిగే వారమని చెప్పారు.