దారుణం : కళ్లకు గంతలు కట్టి.. చెట్టుకు కట్టేసి కర్రలతో దళితుడిపై విచక్షణారహితంగా దాడి
తమిళనాడులో దారుణం జరిగింది. డబ్బు దొంగిలించాడన్న ఆరోపణలతో ఓ దళితుడిపై నలుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. అతని కళ్లకు గంతలు కట్టి... చెట్టుకు కట్టేసి కర్రలతో చితకబాదారు. తంజావూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... తంజావూరుకు చెందిన రాహుల్ అనే ఓ వ్యక్తి కోనూరుకు చెందిన ఓ ఇసుక ట్రాన్స్పోర్ట్ వ్యాపారి వద్ద పనిచేస్తున్నాడు. జనవరి 31న ఆ వ్యాపారి ఇంట్లో రూ.30వేలు నగదు మాయమైంది. రాహుల్ను అనుమానించిన ఆ వ్యాపారి.. విషయం తన సోదరుడికి చెప్పాడు. అతని సోదరుడు తన స్నేహితులను వెంటేసుకుని అక్కడికి చేరుకున్నాడు.
అంతా కలిసి రాహుల్ను ఓ పంట పొలం వద్దకు తీసుకెళ్లి చెట్టుకు కట్టేశారు. కళ్లకు గంతులు కట్టి దుడ్డు కర్రలతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తనకేమీ తెలియదని రాహుల్ ఎంతగా మొత్తుకున్నా వారు వినిపించుకోలేదు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాహుల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ... దెబ్బలకు భరించలేక రాహుల్ నొప్పితో విలవిల్లాడుతున్న వారు కనికరించలేదని చెప్పారు. దొంగిలించిన డబ్బు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతనిపై దాడికి దిగినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.