Chandra Grahanam మే 2021: ఎప్పుడు, ఏ సమయంలో కనిపిస్తుంది?
న్యూఢిల్లీ: దేశాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. వైద్య రంగాన్ని పెను సంక్షోభంలోకి నెట్టేసింది. ఏ రాఫ్ట్రం కూడా దీనికి మినహాయింపు కాదు. పలు రాష్ట్రాల్లో కరోనా సృష్టించిన విధ్వంసకర పరిస్థితులు కనిపిస్తోన్నాయి. కరోనా ధాటికి లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు. రెండున్నర లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. పేషెంట్లకు చికిత్సను అందించడానికి ఆసుపత్రులు చాలట్లేదు. పడకలు సరిపోవట్లేదు. ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. ఈ పరిణామాల మధ్య ఈ నెల 26వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.
ఈ నెల 26వ తేదీన బుధవారం చంద్రుడు.. భూమికి దగ్గరగా వస్తాడు. సాధారణ రోజుల్లో కంటే పెద్దగా కనిపిస్తాడు. ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తాడు. అందుకే్- దీనికి సూపర్ బ్లడ్ మూన్ (Super Blood moon), రెడ్ మూన్ (Red Moon)గా పేరు పెట్టారు. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా పశ్చిమ ప్రాంత రాష్ట్రాలు, దక్షిణ అమెరికాలోని కొన్ని చోట్ల, ఆసియా ఈశాన్య ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. సుమారు 15 నిమిషాల పాటు చంద్రుడిని గ్రహణం కప్పి ఉంచుతుందనే అంచనాలు ఉన్నాయి.
భారత్లో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. దేశం మొత్తం ఈ గ్రహణాన్ని తిలకించ లేకపోవచ్చు. కొన్ని ప్రదేశాల్లో పాక్షికంగా ఈ గ్రహణాన్ని వీక్షించడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి- ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సూపర్ బ్లడ్మూన్ పాక్షికంగా కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఆనుకుని ఉండే పశ్చిమ బెంగాల్లోనూ పాక్షికంగా చంద్రగ్రహణం దర్శనమిస్తుంది. దీని తరువాత- జూన 10వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. నవంబర్ 19వ తేదీన మరోసారి చంద్రగ్రహణం ఏర్పడుంది. అది పాక్షికమే. ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్ 4వ తేదీన మరోసారి సూర్యగ్రహణం సంభవించనుంది.
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని పండితులు అంతరిక్ష అద్భుతాలతో ముడిపెట్టి చూస్తోన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రబలిన తొలి రోజుల నుంచే దీనికి సంబంధించిన వదంతులు పెద్ద ఎత్తున చెలరేగాయి. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ గ్రహణం తరువాతే ఉధృతం కావడాన్ని దీనికి ఉదహరించారు కూడా. గత ఏడాది జూన్ 21వ తేదీన ఏర్పడిన సూర్యగ్రహణం తరువాత క్రమంగా వైరస్ బలహీనపడుతుందని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. అవేవీ శాస్త్రీయ బద్ధం కాదని సైంటిస్టులు స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా ఈ ఏడాదిలో ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణంతో వైరస్ను ముడిపెట్టి చూస్తున్నారు.
2019 జనవరిలో తరువాత ఏర్పడబోతోన్న తొలి సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడంతో అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. పరిశోధకులు ఈ అపూర్వ ఘట్టం కోసం ఎదురు చూస్తోన్నారు. కోఆర్డినేటెడ్ యూనివర్శల్ టైమ్ (UTC time zone) ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల 47 నిమిషాల 39 సెకెన్లకు ఈ చంద్రగ్రహణం ఆరంభం కాబోతోంది. సుమారు అయిదు గంటల పాటు కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటా 49 నిమిషాల 44 సెకెన్లకు ముగుస్తుంది. మొత్తంగా అయిదు గంటలా రెండు నిమిషాల పాటు సుదీర్ఘంగా ఉంటుందిది.
పాక్షిక గ్రహణ కాలం దీనికి సగమే. అంటే 2 గంటల 53 నిమిషాల 14 సెకెన్ల పాటు కొనసాగుతుంది. పాక్షిక చంద్రగ్రహణాన్ని భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మారుమూల ప్రాంతాల వారు మాత్రమే చూడగలిగే అవకాశం ఉంది. భారత్తో పాటు ఆస్ట్రేలియా, అమెరికా పశ్చిమ ప్రాంతం, దక్షిణ అమెరికా పశ్చిమ ప్రాంతం, ఆసియా ఈశాన్య ప్రాంతాల వారు రక్తవర్ణపు చంద్రగ్రహణాన్ని చూడగలుగుతారు. ఆసియా, ఆస్ట్రేలియా, అన్నీ సముద్రతీర ప్రాంత దేశాలు, అలస్కా, కెనడా, హవాయ్, మెక్సికో, సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికా దేశీయుల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది.