వినూత్న ప్రయోగం సక్సెస్ : డ్రోన్లతో బ్లడ్ ప్యాకెట్ల డెలివరీ సక్సెస్
ఉత్తరాఖండ్ : అత్యవసర సమయాల్లో పేషంట్లకు రక్తం అందించేందుకు వినూత్న ప్రయోగం చేశారు అధికారులు. శుక్రవారం ఉత్తరాఖండ్లో రక్తం ప్యాకెట్లను డ్రోన్ ద్వారా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామానికి చేర్చి సక్సెస్ సాధించారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి కేవలం 18 నిమిషాల వ్యవధిలో రక్తం ప్యాకెట్ను డ్రోన్ చేర్చింది. నందగావ్ లోని జిల్లా ఆస్పత్రి నుంచి తెహ్రీకి డ్రోన్ బ్లడ్ ప్యాకెట్స్ను మోసుకెళ్లింది. ఇక ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఆరోగ్యసేవలకు ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
30 కిలోమీటర్లను కేవలం 18 నిమిషాల్లో కవర్ చేసిందంటే డ్రోన్ దాదాపు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు అనారోగ్యానికి గురైతే రక్తం అవసరమైన సమయంలో కచ్చితంగా ఈ పద్ధతి చాలా మేలు చేస్తుందని తెహ్రీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. రోడ్డు మార్గం ద్వారా ఈ బ్లడ్ ప్యాకెట్ను తరలించాలంటే దాదాపు గంటన్నర సమయం పట్టేదని డ్రోన్ సహాయంతో కేవలం 18 నిమిషాల్లోనే తరలించగలిగామని వైద్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చికిత్స సమయంలో బ్లడ్ అవసరమైతే ఇలా తరలించి వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.
Uttarakhand: Blood sample was sent from Dist Hospital,Nandgaon to Dist Hospital,Tehri through a drone, y'day. Dr in Tehri hospital says, "It was a successful trial run. Hospital was 30 km away but blood was transported within 18 min. It'll be helpful for patients in remote areas" pic.twitter.com/DSntXXThlS
— ANI (@ANI) June 8, 2019
టెలిమెడిసిన్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని ప్రయోగించామని చెప్పారు వైద్యులు. ఈ బ్లడ్ ప్యాకెట్లను ఒక కూలింగ్ వ్యవస్థలో అమర్చి డ్రోన్లలో తరలించామని అలా చేయడం వల్ల రక్తం పాడవకుండా ఉంటుందని చెప్పారు. ఇక దీన్ని మరింతగా అభివృద్ధి చేసి రియల్ టైంలో ప్రవేశ పెడుతామని చెప్పారు. ఇక ఈ డ్రోన్ను సీడీఎస్ స్పేస్ రోబోటిక్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసింది. ఐఐటీకి చెందిన పూర్వ విద్యార్థులు నిఖిల్ ఉపాధ్యాయ్ ఈ కంపెనీని స్థాపించారు. నెక్ట్స్ జనరేషన్ డ్రోన్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఇక 500 గ్రాముల బరువును ఈ డ్రోన్లు మోసుకెళ్లగలవని, 50 కిలోమీటర్ల వరకు చార్జింగ్ ఉంటుందని తెలిపారు.