బిఎంసి పోల్స్: ఎగ్జిట్ సర్వేలు ఏం చెబుతున్నాయి..
సంపన్న మున్సిపల్ కార్పొరేషన్.. మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీతోపాటు శివసేన పోటాపోటీగా నిలిచాయి.
ముంబై: సంపన్న మున్సిపల్ కార్పొరేషన్.. మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీతోపాటు శివసేన పోటాపోటీగా నిలిచాయి. రెండు పార్టీలు విడివిడిగా పోటీచేశాయి. ఈ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. బీజేపీ, శివసేన ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ప్రత్యేకించి బీఎంసీలో పాగా వేసేందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పట్టు కొనసాగించేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్థాకరే హోరాహోరీగా ప్రచారంచేశారు. మంగళవారం బీఎంసీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన 32 శాతం చొప్పున ఓట్లు పొందాయని యాక్సిస్ - మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కాంగ్రెస్ పార్టీ 16 శాతానికి పరిమితం కాగా, ఎన్సీపీ నాలుగు శాతం, రాజ్ఠాక్రే సారథ్యంలోని ఎమ్మెన్నెస్ ఎనిమిది శాతం ఓట్లు పొందుతాయని పోల్స్ అంచనా వేశాయి.
శివసేన 86 నుంచి 92 సీట్లు, శివసేనకు చేరువలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 30 - 34 సీట్లు గెలుచుకునే అవకాశమున్నదని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇక ఎన్సీపీ మూడు నుంచి ఆరు, ఎమ్మెన్నెస్ ఐదు నుంచి ఏడు స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేశాయి. 1996 నుంచి బీఎంసీలో అధికారంలో ఉన్నశివసేన ఈ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తే, ఫడ్నవీస్ ప్రభుత్వానికి కష్టాలు మొదలైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవేళ బీజేపీ ప్రభుత్వానికి ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన మద్దతు ఉపసంహరించుకుంటే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అంశాల వారీ మద్దతునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ ప్రారంభ దశలోనే సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఎంసీలో 55 శాతం, మిగిలి తొమ్మిది నగరపాలక సంస్థల్లో మొత్తంగా 56 శాతం పోలింగ్ నమోదైంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే బీఎంసీలో 10 శాతం ఓటింగ్ పెరిగింది. వీటితోపాటు 11 జిల్లాల్లో జిల్లా పరిషత్, 118 పంచాయతీ సమితులకు ఎన్నికలు జరిగాయి. గురువారం ఫలితాలు వెలువడతాయి.
పవార్ ఇలా
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తన కూతురు - ఎంపీ సుప్రియా సూలే, అల్లుడు సదానంద్ సూలే, మనుమరాలితో కలిసి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
బంద్రాలో ఉద్ధవ్ థాకరే ఓటు
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, ఆయన భార్య రష్మీ థాకరే, కుమారుడు ఆదిత్యా థాకరే.. బంద్రాలోని పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటీస్ పీరియడ్పై ఉన్నదని, మద్దతుపై గురువారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రాజ్ థాకరే ఇలా
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్ థాకరే, భార్య షర్మిలా థాకరే, తమ పిల్లలు అమిత్, ఊర్వశిలతో కలిసి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదర్ లోని బాల్మోహన్ విద్యాలయలో వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాజకీయ పార్టీలు నిలుపుకోవాలని ఆయన సూచించారు.
భర్తతో కలిసి ప్రియాదత్
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాదత్, తన భర్త ఓన్ రోంకాన్తో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె బాలీవుడ్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి సునీల్ దత్ కూతురు. ఆమె సోదరుడే సంజయ్ దత్.
ఎంపీ పూనం మహాజన్ ఇలా..
బీజేపీ నేత పూనం మహాజన్, తన సోదరుడు రాహుల్ మహాజన్ తో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. 13 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీజేపీ సీనియర్ నేత ప్రమోద్ మహాజన్ కూతురు ఆమె.
ఇలా ఫడ్నవీస్
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన భార్య అమృత, తల్లితో కలిసి నాగ్పూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రికార్డు స్థాయిలో ఓటు వేసిన ముంబై వాసులకు ఆయన క్రుతజ్నతలు తెలిపారు.
ఓటేసిన రేఖ
రాజ్యసభ సభ్యురాలు, అలనాటి బాలీవుడ్ సినీ నటి రేఖ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంద్రాలోని పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటేశారు.
ఓటేసిన సినీ నిర్మాత జోయా అక్తర్
సినీ
నిర్మాత
జోయా
అక్తర్
కూడా
తన
ఓటు
హక్కు
వినియోగించుకున్నారు.
ఈ
సందర్భంగా
ఆమె
స్పందిస్తూ
రోడ్లపైకి
రావడం
కష్టతరంగా
ఉన్నదని
వ్యాఖ్యానించారు.
నగరాన్ని
పరిశుభ్రంగా
ఉంచేందుకు
ప్రయత్నించాలని
ముంబై
వాసులను
కోరారు.
ఓటేసిన బీజేపీ ఎంపీ హేమమాలిని
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత ఓటేసినట్లు తన చేతికి ఇంకు అంటించిన గుర్తు చూపారు.
కుటుంబ సభ్యులతో కలిసి...
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. మెరుగైన ముంబై నగరం కోసం, మార్పు కోసం ఓటేశామని ట్వీట్ చేశారు.
అంజలీతో కలిసి సచిన్
మాస్టర్ బ్లాస్టర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలీతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.