చిన్న పార్టీలపైనే బీజేపీ, శివసేన ఆశలు: కాంగ్రెస్ పార్టీలో బ్లేమ్ గేమ్
బ్రుహన్ ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో పోటాపోటీగా కార్పొరేటర్లను గెలుచుకున్న శివసేన, బీజేపీ మేయర్ అభ్యర్థిని గెలిపించుకోవడంపై ద్రుష్టిని కేంద్రీకరించాయి.
ముంబై: బ్రుహన్ ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో పోటాపోటీగా కార్పొరేటర్లను గెలుచుకున్న శివసేన, బీజేపీ మేయర్ అభ్యర్థిని గెలిపించుకోవడంపై ద్రుష్టిని కేంద్రీకరించాయి. శివసేన 84 మంది, బీజేపీ 82 మంది కార్పొరేటర్లను గెలుచుకోవడంతోపాటు కాంగ్రెస్ 31 స్థానాల్లో విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది.
బీజేపీ ఆధిపత్యంపై మండిపడుతున్న శివసేన.. తిరిగి ఆ పార్టీతో జత కట్టేందుకు మీన మేషాలు లెక్కిస్తున్నా.. చివరకు బీజేపీతో కలిసి పనిచేసే అవకాశాలే కనిపిస్తున్నాయి.
అయితే మేయర్ పదవికి నామినేషన్ల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో రెండు పార్టీలు 'సింగిల్ డిజిట్' సంపాదించిన పార్టీలు, స్వతంత్ర కార్పొరేటర్ల వైపు ద్రుష్టిని కేంద్రీకరించాయి. మేయర్ పదవితోపాటు విద్య, ఆరోగ్యం, బెస్ట్ కమిటీల ఎన్నికలు కూడా కీలకమే.
మేయర్తోపాటు కమిటీలు కీలకమే
దాదాపు చెరి సమానంగా కార్పొరేటర్లను గెలుచుకున్న నేపథ్యంలో విధాన నిర్ణాయక కమిటీలకు కౌన్సిల్, స్టాండింగ్ కమిటీల్లో మౌలిక వసతుల కల్పన కమిటీ ఎన్నిక కోసం రెండు పార్టీలకు చెరో పది మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ కమిటీకి చెరో ఎనిమిది మంది, బెస్ట్ కమిటీకి ఆరుగురు సభ్యుల మద్దతు తప్పనిసరి. విధాన నిర్ణయాలను ఖరారు చేసే స్టాండింగ్ కమిటీ, భూ రిజర్వేషన్లపై మౌలిక వసతుల కమిటీ కీలకమైనవి.
బీజేపీకి పెరిగిన బలం
227 మంది స్థానాల బీఎంసీలో మద్దతుదారులతో కలిపి శివసన కార్పొరేటర్ల సంఖ్య 88కి, బీజేపీకి మద్దతునిచ్చేవారితో కలిసి 84 మందికి చేరుకున్నది. అఖిల్ భారతీయ సేన (ఎబిఎస్)కు చెందిన ఏకైక కార్పొరేటర్ గీతా గావ్లీ మద్దతు సంపాదించింది. గీతా గావ్లీకి స్టాండింగ్ కమిటీలో సభ్యత్వం, బీఎంసీ హెల్త్ కమిటీ చైర్మన్ పదవి ఆశ చూపి తన వైపునకు తిప్పుకున్నది. మరో స్వతంత్ర కార్పొరేటర్ రుబియా ఖాన్ మద్దతు కూడా బిజెపి సంపాదించగలిగింది.
ఇలా మేయర్ ఎన్నికపై ఎమ్మెన్నెస్
తదుపరి మేయర్ మరాఠీయే ఉంటారని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) నేత నితిన్ సర్దేశాయి వ్యాఖ్యానించారు. ఎమ్మెన్నెస్ ఆప్షన్లు బహిరంగమే. ఏ ఒక్కరికో మద్దతుగా ఉండే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెన్నెస్ కు పాలక మండలి ఏడుగురు కార్పొరేటర్లు ఉన్నారు. కనుక వారు ఎవరికి మద్దతుగా నిలుస్తారన్నది చివరి క్షణం వరకూ అనుమానంగానే ఉన్నది. శుక్రవారం మేయర్ అభ్యర్థిగా ఎమ్మెన్నెస్ నామినేషన్ వేయడం దీనికి తావిస్తున్నది.
పొత్తుపై చంద్రకాంత్ పాటిల్ ఇలా..
బీఎంసీ ఎన్నికల్లో బిజెపి, శివసేన చేతులు కలపడం ఖాయమని మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ ధీమా వ్యక్తంచేశారు. ఇరు పార్టీల మధ్య ఆమోదయోగ్యమైన ఫార్ములా రూపకల్పనపై ద్రుష్టిని కేంద్రీకరించామని చెప్పారు. 200 శాతం రెండు పార్టీలు చేతులు కలుపుతాయని పేర్కొన్నారు. బీఎంసీ మేయర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగిన నేపథ్యంలో చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు గమనార్హం. మరోవైపు బీజేపీ ప్రకటనలు చేయడం మాని పొత్తుపై చర్చలకు వస్తే సత్ఫలితాలు వస్తాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
సంజయ్ ను నిలదీసిన గురుదాస్
బీఎంసీ ఎన్నికల్లో పోటాపోటీగా సమాన స్థాయిలో సీట్లు గెలుచుకున్న శివసేన, బిజెపి పట్టుకోసం ప్రయత్నిస్తుంటే.. ఘోర పరాజయం పాలవ్వడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పొరపాట్లకు గుణపాఠం నేర్చుకోవడం సంగతలా ఉంచి పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడంపైనే ద్రుష్టిని కేంద్రీకరించారు. విషాదకర స్థాయిలో పార్టీ ఓటమి పాలవ్వడానికి కారణాలు వివరించాలని ముంబై కాంగ్రెస్ పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్ను కేంద్ర మాజీ మంత్రి గురుదాస్ కామత్ డిమాండ్ చేశారు. తక్షణం పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ప్రచార, ఇతర కార్యక్రమాలకు వ్యూహాల అమలు తీరును సమీక్షించాల్సిందేనని అన్నారు. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఇప్పటికే సంజయ్ నిరుపమ్ ముంబై కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. గమ్మత్తేమిటంటే గురుదాస్ కామత్, ప్రియాదత్ టిక్కెట్లు ఇప్పించుకున్న వారు తమ అభ్యర్థులు గెలిపించుకోలేకపోయారని పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.