ధారావిలో ఏం జరుగుతోంది? పారిశుద్ధ్య కార్మికుడికి వైరస్.. మరో కానిస్టేబుల్కు కూడా
నిజమే, ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపడానికి ఇది సమయంకాదు. ప్రపంచమే కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతోంది. కానీ వైరస్ నివారణ, నియంత్రణ చర్యల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతోన్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపైనా ఉంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో.. పారిశుద్ధ్య కార్మికుడికి వైరస్ సోకడం, బెంగళూరులో పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు సరఫరా చేయలేదని వెల్లడికావడంతో వారి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
దేశంలోనే అత్యధిక 339 కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర మోస్ట్ ఎఫెక్టెడ్ ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై సిటీలోనే 100 మందికిపైగా వైరస్ సోకింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుపొందిన ధారావిలో 24 గంటల వ్యవధిలోనే రెండో పాజిటివ్ కేసు నమోదుకావడం, అందులో ఒకరు మరణించడం కలకలం రేపింది. పాజిటివ్ గా తేలిసిన రెండో వ్యక్తి.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ)లో పారిశుద్ధ్య కార్మికుడని అధికారులు వెల్లడించారు. వొర్లీలో నివసించే ఆ కార్మికుడు.. ప్రతిరోజూ ధారావీకి వెళ్లి పనిచేస్తుంటాడని, ప్రస్తుతం ఆయనను ఐసోలేషన్ వార్డుకు తరలించామని పేర్కొన్నారు. ముంబై సిటీ కమిషనరేట్ లో పనిచస్తోన్న ఓ కానిస్టేబుల్ కు కూడా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో సిబ్బంది భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దాదాపు 15 లక్షల మందికిపైగా పేదలు దగ్గరదగ్గరగా నివసించే ధారావీలో వైరస్ విస్పోటనం జరిగితే ఊహించలేనంత పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశముంది. దీంతో అధికారులు ఆ మురికివాడపై స్పెషల్ ఫోకస్ పెట్టి చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ తో చనిపోయిన వ్యక్తి ఇంటిని ఖాళీ చేయించి, ఆ ప్రాంతమంతా క్రిమిసంహారక మందులు చట్టారు. చనిపోయిన వ్యక్తికుటుంబీకులు, పక్కింటివాళ్లను కూడా క్వారంటైన్ కు తరలించినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు. మరోవైపు..
కర్నాటకలోనూ ఇదే తరహా ఘనటలు వెలుగుచూశాయి. బృహత్ బెంగళూరు మహానగర్ పాలికె(బీబీఎంపీ)కి చెందిన పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది సరిపడా మాస్కులు, ఇతర రక్షణ సదుపాయాలు కల్పించకపోవడం కలకలం రేపింది. పలు చానెళ్లలో దీనికి సంబంధించిన వార్తలు ప్రసారంకాగా, మేయర్ గౌతం కుమార్ స్పందించారు. బీబీఎంపీలో కార్మికులందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, వాళ్లంతా మాస్కులు ధరించి పనులు చేస్తూ, వీలైనన్ని ఎక్కువసార్లు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుంటున్నారని మేయర్ తెలిపారు.