షాకింగ్: సిటీ బస్సుల్లోనూ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం: టికెట్ తో పాటు చలాన్ కూడా!
బెంగళూరు: పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై భారీగా జరిమానాలను విధిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.
తాజాగా సిటీ బస్సుల్లోనూ వాటి వినియోగాన్ని నిషేధించింది. సిటీ బస్సుల్లో ప్రయాణికుల చేతుల్లో ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తే.. టికెట్ తో పాటు జరిమానా విధించిన చలాన్ ను కూడా చేతిలో పెట్టబోతున్నారు కండక్టర్లు. బెంగళూరు మహానగర రవాణా సంస్థ (బీఎంటీసీ) దీనిపై కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.
ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై కర్ణాటక ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. బెంగళూరు మెట్రోపాలిటన్ పరిధిలో ప్రతి చిన్న దుకాణంలో కూడా ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం విధించింది. హోటళ్లు, మార్కెట్లు, దుకాణ సముదాయాలతో పాటు చిన్న షాపుల్లోనూ దీన్ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు.
ఏదైనా షాపులో ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తే.. భారీ జరిమానాలను విధిస్తున్నారు. కనిష్ఠంగా 5000 రూపాయల జరిమానాను రాబట్టుకుంటున్నారు. ఫలితంగా- ప్రస్తుతం బెంగళూరు ఏ చిరు వ్యాపారి కూడా ప్లాస్టిక్ కవర్ల జోలికి వెళ్లట్లేదు. వాటి స్థానంలో కాగితాలను వాడుతున్నారు.
తాజాగా ఇదే నిషేధాన్ని సిటీ బస్సులకూ వర్తింపజేశారు. సిటీ బస్సుల్లో ప్రయాణికులెవరూ ప్లాస్టిక్ కవర్లను తమ వెంట తీసుకుని వెళ్లకూడదని ఆదేశించారు బీఎంటీసీ మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ఓ సర్కులర్ ను జారీ చేశారు. ప్లాస్టిక్ కవర్లను వెంట తీసుకెళ్లే ప్రయాణికులకు తొలుత హెచ్చరికలు, ఆ తరువాత జరిమానాలను విధించే హక్కును కండక్టర్లకు ఇచ్చారు.
ప్రస్తుతం బీఎంటీసీ పరిధిలో ఆరువేలకు పైగా సిటీ బస్సులు ఉన్నాయి. రోజూ వాటిల్లో లక్షలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లను తీసుకెళ్లకుండా వారందర్నీ ఓ కంట కనిపెట్టడం కష్టతరమే అయినప్పటికీ..తప్పదని అధికారులు సూచించారు.