మేయర్: కాంగ్రెస్ దెబ్బకు గిలగిలలాడిన బీజేపీ
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలలో అధిక సీట్లు సంపాధించుకున్న బీజేపీకి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి పెద్ద షాక్ ఇచ్చాయి. బీజేపీ మీద పగ తీర్చుకున్న కాంగ్రెస్ నాయకులు మిఠాయిలు పంచుకుని పండగ చేసుకున్నారు.
బీబీఎంపీ మేయర్ ఎన్నికలలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు 131 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మడివాళ కార్పొరేటర్ మంజునాథ రెడ్డి మేయర్ గా గెలిచారు. డిప్యూటి మేయర్ గా పోటి చేసిన హేమలతా (జేడీఎస్)కు 131 ఓట్లు రావడంతో ఆమె గెలిచారు.
బీజేపీ మేయర్ అభ్యర్థిగా పోటి చేసిన మంజునాథ రాజుకు 128 ఓట్లు, డిప్యూటి మేయర్ గా పోటి చేసిన హెచ్.సి. నాగరత్నకు 128 ఓట్లు రావడంతో ఆ ఇద్దరూ ఓడిపోయారు. అనుకున్నట్లే కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ తో కలిసి బీబీఎంపీ మేయర్, డిప్యూటి మేయర్ సీట్లు కైవసం చేసుకుంది.
కాంగ్రెస్, జేడీఎస్ దొడ్డిదారిలో బీబీఎంపీ మేయర్, డిప్యూటి మేయర్ స్థానాలు కైవసం చేసుకున్నాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. బీబీఎంపీ కౌన్సిల్ హాల్ లో, బయట ధర్నాలు నిర్వహించారు. బెంగళూరు ప్రజలు తమను ఆదరించారని గుర్తు చేశారు.
ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ప్రయత్నించారని విమర్శించారు. న్యాయపోరాటం చేసి తామే అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు చెప్పారు. బీబీఎంపీ మేయర్ ఎన్నిక సందర్బంగా పోలీసు అధికారులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
అరెస్టుల పర్వం.........!
కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు బెంగళూరు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ యువమోర్చా ఆధ్యర్యంలో బీబీఎంపీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నిషేధాజ్ఞలు అమలులో ఉండటంతో పోలీసులు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.
అదే విధంగా బీజేపీకి విరద్దుంగా కాంగ్రెస్ కు చెందిన న్యాయవాదులు బీబీఎంపీ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. మాట వినకపోడంతో న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.