బాలికల దుస్తులిప్పి తనిఖీ చేసిన సిబ్బంది
పూణె: హెచ్ ఎస్ సీ పరీక్షలకు హజరైన బాలికల దుస్తులు విప్పించి తనిఖీ చేసిన ఘటన మహరాష్ట్రలోని పూణెలో కలకలం రేపుతోంది. 12 తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన బాలికలను తనిఖీ చేసిన మహిళా సిబ్బంది వారి దుస్తులు విప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు మహిళా సిబ్బందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై స్కూలు యాజమాన్యం స్పందించింది. విద్యార్థినులను తాము తనిఖీ చేశాం తప్పితే దుస్తులు విప్పమని చెప్పలేదని పేర్కొంది.
పుణెలోని పృథ్వీరాజ్ కపూర్ మెమోరియల్ జూనియర్ కళాశాలకు చెందిన 219 మంది 12వ తరగతి విద్యార్థులు బోర్డు ఎగ్జామ్స్ రాసేందుకు పరీక్ష కేంద్రమైన ఎంఐటీ విశ్వశాంతి గురుకుల్ హయ్యర్ సెకండరీ స్కూల్కు చేరుకున్నారు.
విద్యార్థులు స్లిప్పులు తెచ్చి ఉంటారేమోననే ఉద్దేశంతో అక్కడి సిబ్బంది వారిని దుస్తులు విప్పించి మరీ తనిఖీ చేసినట్టు బాలికలు ఆరోపించారు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.