పండగవేళ విషాదం: పడవ బోల్తా, 26 మంది మృతి
బీహార్ రాజధాని పట్నాలో పెను విషాదం చోటుచేసుకుంది. పట్నా వద్ద గంగా నదీ తీరం సమీపంలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు.
పాట్నా: బీహార్ రాజధాని పట్నాలో పెను విషాదం చోటుచేసుకుంది. పట్నా వద్ద గంగా నదీ తీరం సమీపంలో ఓ పడవ మునిగిపోయింది. ఓ దీవి వద్ద పతంగుల పండుగ నిర్వహిస్తున్న బృందం పడవ బోల్తా పడింది.
ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. పడవ మునకకు గురయిందన్న విషయం తెలియగానే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది పలువురిని రక్షించారు. కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు.
పడవ ప్రమాదానికి గురయిన సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను పడవలో ఎక్కించుకున్నందునే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు గుర్తించారు. గల్లంతైన మిగతా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఘటన పైన ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించాలు. కాగా, శనివారం రాత్రి సహాయక చర్యలు నిలిచిపోయాయి. చీకటి కారణంగా సహాయక చర్యలు నిలిచాయని, తిరిగి ఆదివారం ఉదయం ప్రారంభిస్తామని పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ తెలిపారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్, పోలీసులు అధికారులు ఇక్కడే రాత్రంతా ఉండి పర్యవేక్షిస్తారని, ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభిస్తామన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు బీహార్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపింది.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతులకు కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఆర్థికసాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
26కు చేరిన మృతులు
ఈ ఘటనలో తొలుత 19 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 26కు చేరింది.