ఘోర ప్రమాదం: యమునా నదిలో పడవ మునగడంతో 20 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాందా జిల్లాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. యమునా నదిలో పడవ మునిగిపోవడంతో.. 20 మంది మరణించారు. ఇప్పటి వరకు పలువురి మృతదేహాలను బయటికి తీశారు. కొంతరు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకుచేరడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
మరికొంతమంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు జరుగుతోంది. మర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 50 మంది ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మర్కా నుంచి ఫతేపుర్లో ఉన్న జరౌలీ ఘాట్ కు యమున నది మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బలమైన గాలులతో సుడిగుండం ఏర్పడి.. పడవ మునిగిపోయిందని తెలుస్తోంది.
ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న అధికారులు, గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బంది సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.