ఆ బోటుకు ఏమైంది? 243మంది ఎక్కడున్నారు? 5 నెలలుగా వీడని మిస్టరీ..
ఢిల్లీ : బిడ్డ జాడ తెలియని వారు ఒకరు. తండ్రి కోసం తపిస్తున్నవారు ఇంకొకరు. భర్త ఎప్పుడొస్తాడా అని కళ్లలో ఒత్తులు వేసుకుని కాలం వెళ్లదీస్తున్న వారు మరికొందరు. ఐదు నెలలు గడిచిపోయాయి. తమవారు ఏమైపోయారో, ఎక్కుడున్నారో తెలియదు. అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో అంతకన్నా తెలియదు. ఐదు నెలల క్రితం కేరళలో అదృశ్యమైన బోటులో ప్రయాణిస్తూ పత్తా లేకుండా పోయిన వారి కుటుంబాల్లో ఎవరిని కదిలించినా కన్నీళ్లే కనిపిస్తాయి.
అక్రమంగా విదేశాలకు
2019 జనవరి 12. దాదాపు 243 మందితో కేరళలోని ఎర్నాకుళం నుంచి చేపల బోటు బయలుదేరింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్రమంగా విదేశాలకు వలస వెళ్తున్నవారే. బోటులో ఉన్నవారిలో 184 మంది ఢిల్లీ అంబేద్కర్ నగర్ స్థిరపడ్డ తమిళులు. దశాబ్దాల క్రితం ఢిల్లీకి వలసపోయి విలాసవంతమైన జీవితం కోసం తమిళనాడు, కేరళకు చెందిన వారితో కలిసి అక్రమంగా పయనమయ్యారు.
బోటు ఎక్కిన తర్వాత జాడలేదు
బోటు ఎక్కిన తర్వాత 243 మందిలో ఎవరి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దేశంకాని దేశం కష్టాల్లో ఉన్నారేమో కుదురుకున్నాక ఫోన్ చేస్తారని కుటుంబ సభ్యులు ఆశ పెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. కానీ ఎవరి నుంచి ఫోన్ లేదు. కనీసం ఎక్కడున్నారో తెలియదు. కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఐదు నెలలు దాటినా అయినవారు ఏమైపోయారో తెలియక వారు పడుతున్న వేదన వర్ణనాతీతం.
కొచ్చిలో 50 బ్యాగులు
జనవరి 11న కోచి సమీపంలోని మునంబు తీరం. కొన్ని బ్యాగులు పడున్నాయన్న సమాచారంతో కేరళ పోలీసులు అక్కడికి చేరుకుని 50బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు మరికొన్ని బ్యాగులతో పాటు ఐడెంటిటీ కార్డులు, ఫైళ్లు కనిపించాయి. బోటులో స్థలం సరిపోక లగేజీ వదిలేసి వెళ్లి ఉంటారని భావించిన పోలీసు మిస్టీరియస్ కేసు నమోదుచేశారు. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, కేరళకు చెందిన కొందరు ఉద్యోగాల పేరుతో వీరందరినీ అక్రమంగా విదేశాలకు పంపినట్లు గుర్తించారు. కేసులో ఇప్పటి వరకు 10మందిని అరెస్ట్ చేశారు. అయినా అదృశ్యమైన వారి జాడ మాత్రం తెలియలేదు.
కేరళ హైకోర్టు సీరియస్
243మంది అదృశ్యం కావడంపై కేరళ హైకోర్టు స్పందించింది. ఇదేమంత చిన్న విషయం కాదని, దేశ భద్రతతో ముడిపడిన అంశమని అభిప్రాయపడింది. మానవ అక్రమ రవాణాతో సంబంధం ఉండి ఉండొచ్చని అనుమానించింది. భారత అధికారుల విజ్ఞప్తి మేరకు ఇంటర్ పోల్ ఢిల్లీ నుంచి వెళ్లిన 184మందిపై బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. అయితే అదృశ్యమైన వారి గురించి విదేశాల నుంచి ఎటువంటి సమాచారం అందలేదని ఇంటర్పోల్ ప్రకటించింది. దాదాపు 150రోజులు గడిచినా తమ వారి జాడ తెలియక అంబేద్కర్నగర్ వాసులు దినమొక యుగంలా గడుపుతున్నారు.