delhi violence: డ్రైనేజీల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలు, 11కు చేరిక, మృతులు 47
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించిన ఘోరాుల బయటపడుతూనే ఉన్నాయి. వారం రోజుల క్రితం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
Delhi violence: 2 ప్రత్యేక దర్యాప్తు బృందాల ఏర్పాటు, ఇక కేసులన్నీ బదిలీ
డ్రైనేజీలోనే ఐబీ అధికారి మృతదేహం..
ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఇప్పటి వరకు 47 మంది ప్రాణాలు కోల్పోగా.. 350 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఫిబ్రవరి 26న ఇంటెలీజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ మృతదేహం డ్రైనేజీలో లభ్యమైన విషయం తెలిసిందే. ఘర్షణల సమయంలోనే అంకిత్ శర్మను అత్యంత దారుణంగా చంపి డ్రైనేజీలో పడేశారని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు.
డ్రైనేజీలో కొట్టుకొస్తున్న మృతదేహాలు..
అల్లరు జరిగిన ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో ఆది, సోమవారాల్లో మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. పలు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో తాజాగా లభ్యమవడంతో గుర్తించడానికి వీలులేకుండా ఉండటంతో.. డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 11 మృతదేహాలు ఈ డ్రైనేజీల్లో లభ్యమవడం గమనార్హం. అయితే, అన్ని మృతదేహాలు అల్లర్లకు సంబంధించినవేనా? లేక ఇతర కారణాలతో చనిపోయిన వారివి కూడా ఉన్నాయా? అనేది పోలీసులు విచారిస్తున్నారు.
ఈశాన్య ఢిల్లీలో భారీ విధ్వంసం..
గత ఆదివారం నుంచి బుధవారం వరకు ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆందోళనకారులు పలు ఇళ్లకు, వాహనాలకు నిప్పుపెట్టారు. కాల్పులు జరిపారు. దాడులకు పాల్పడ్డారు. ఆ మూడు రోజుల్లో ఈశాన్య ఢిల్లీలో భారీ విధ్వంసం జరిగింది. 47 మంది ప్రాణాలు కోల్పోగా, 350మందికిపైగా గాయాలపాలయ్యారు. కాగా, పోలీసులు, భారీ ఎత్తున సైనిక బలగాలు రంగంలోకి దిగడంతో గత బుధవారం అల్లర్లు పూర్తిగా సద్దుమణిగాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ సా ఈ ఘర్షణలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘర్షణలకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి ఢిల్లీ శాంతిభద్రతలు, అభివృద్ధిపై చర్చించారు.