ఒకే ఇంట్లో అయిదు మృతదేహాలు: కుళ్లిన స్థితిలో: బురారీ ఉదంతం గుర్తుకు: ఉలిక్కిపడ్డ.. !
న్యూఢిల్లీ: బురారీ ఉదంతం. న్యూఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ఇంకా ఢిల్లీవాసులను ఉలిక్కి పడేలా చేస్తుంటుంది. బిజినెస్ మాగ్నెట్గా పేరున్న వ్యక్తి కుటుంబంలోని చిన్నా, పెద్దా అందరూ ఒకేసారి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటనను గుర్తుకు తెచ్చేలా మరో విషాదకర దుర్ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. బురారీ ఉదంతాన్ని గుర్తుకు తీసుకొచ్చిన ఆ ఘటన న్యూఢిల్లీలోని భజన్పురాలో చోటు చేసుకుంది.
26/11 ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్కు అయిదేళ్ల జైలు: అమలు చేస్తారా? డ్రామాలకు తెర తీస్తారా?
భజన్పురాలోని ప్రాంతంలో ఓ ఇంట్లో నుంచి అయిదు మృతదేహాలను పోలీసులు బుధవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు.. బాగా కుళ్లి పోయిన స్థితిలో. మృతులను శంభూలాల్, ఆయన భార్య సునీత, కుమారులు శివమ్, సచిన్, కుమార్తె కోమలగా గుర్తించారు. ఈ అయిదుమంది ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం తరలించారు.
పోస్ట్మార్టమ్ నివేదిక అందిన తరువాతే.. వారు మరణించడానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించగలమని పోలీసులు చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడానికే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించామని అన్నారు. మృతదేహాల పరిస్థితిని బట్టి వారు మరణించి అయిదురోజులు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శంభూలాల్ ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున దుర్వాసన వస్తోన్న విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించారు.
శంభూలాల్, ఆయన భార్యా, పిల్లలను పలుమార్లు పిలిచినప్పటికీ.. ఇంట్లో నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీనితో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు శంభూలాల్ ఇంటికి చేరుకున్నారు. తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. మూడు గదులు ఉన్న ఆ ఇంట్లో శంభూలాల్, సునీత మృతదేహాలు ఒక గదిలో.. శివమ్, సచిన్, కోమల మృతదేహాలు మరో గదిలో లభించాయి. వెంటనే పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను పిలిపించారు. డీసీపీ వేద ప్రకాశ్ సూర్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.