సహజీవనం: ప్రేమజంటను చంపేసి వేర్వేరు చోట్ల పడేశారు
ట్యూటికోరిన్: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న ఓ ఇద్దరు యువతీయువకులను హత్య చేసిన దుండగులు, వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. దీన్ని పరువు హత్యగా అనుమానిస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
మృతురాలు సి అరుణ(32) శరీరం పాక్షికంగా కాలిపోయి ఉందని చెప్పారు. ఆమెను గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోందని చెప్పారు. సి రాజ్నాగేష్(25) అనే యువకుడి మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయిందని తెలిపారు. ఈ రెండు మృతదేహాలను జూన్ 3న ట్యూటికోరిన్కు సమీపంలోని అటవీ ప్రాంతంలో వేర్వేరుగా గుర్తించినట్లు చెప్పారు.
అరుణకు గత ఐదేళ్ల క్రితం ముత్తుస్వామి అనే వ్యక్తితో వివాహమైందని, అయితే ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం డ్రైవర్గా పని చేస్తున్న రాజ్నాగేష్తో అరుణ ప్రేమలో పడింది.
ఈ నేపథ్యంలో వారిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. కాగా, ఇది ఆమె కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో వారే వీరిద్దరిని హత్య చేశారని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.