రాజకీయ ప్రాధాన్యత..ఆర్థిక సహకారం: బోడో శాంతి ఒప్పందంపై ప్రభుత్వం సంతకాలు
న్యూఢిల్లీ: అస్సాంలోని తీవ్రమైన తిరుగుబాటు సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోరోలాండ్తో ప్రభుత్వం శాంతి ఒప్పందంపై సంతకాలు చేసింది. బోరోలాండ్కు రాజకీయ సహకారంతో పాటు ఆర్థిక సహకారం కూడా అందిస్తామని ప్రభుత్వం ఒప్పందంలో పేర్కొంది. ప్రత్యేక బోడోలాండ్ కోసం కొన్నేళ్లుగా ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ నేతృత్వంలో ఉద్యమం జరుగుతోంది. ఈ ఒప్పందంపై ఆల్బోడో స్టూడెంట్స్ యూనియన్ కూడా సంతకాలు చేసింది.
ఈ త్రైపాక్షిక ఒప్పందంపై అస్సాం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్, ఎన్డీఎఫ్బీ అగ్రనాయకులు, ఏబీఎస్యూ నాయకులు, కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర గార్గ్ మరియు అస్సాం చీఫ్ సెక్రటరీ కుమార్ సంజయ్ కృష్ణన్లు సంతకాలు చేశారు. వీరంతా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇదొక చారిత్రాత్మకమైన ఒప్పందంగా అభివర్ణించారు కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా. అంతేకాదు బోడో సమస్యకు ఒక పరిష్కారం దిశగా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని చెప్పారు.
Delhi: Government of India signs tripartite agreement with representatives of all factions of banned organisation National Democratic Front of Bodoland (NDFB) at Ministry of Home Affairs (MHA); Home Minister Amit Shah and Assam CM Sarbananda Sonowal present pic.twitter.com/Knyebw7WSo
— ANI (@ANI) January 27, 2020
ఇదిలా ఉంటే బోడోలతో శాంతి ఒప్పందంపై సంతకాలను వ్యతిరేకిస్తూ నాన్ బోడో సంస్థలు 12 గంటల పాటు అస్సాం బంద్కు పిలుపునిచ్చాయి. ఆగిపోయిన బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్కు బోడో ఉద్యమం ఊపిరిపోసిందని ఇప్పుడు శాంతి ఒప్పందం చేసుకోవడమంటే ఉద్యమాన్ని పక్కకు పెట్టినట్లే అని ఆ సంస్థలు చెప్పుకొచ్చాయి. ఇదిలా ఉంటే కొక్రాఝార్, బక్సా, చిరాంగ్, మరియు ఉదల్గురి జిల్లాలో బంద్ కారణంగా జనజీవనం స్తంభించిపోయిందని సమాచారం. ఈ జిల్లాల్లో బంద్ ప్రభావం బాగా కనిపించినట్లు తెలుస్తోంది.
బోడో శాంతి ఒప్పందంకు నిరసనగా కొక్రాఝార్ జిల్లాలో ఆందోళనకారులు టైర్లకు నిప్పు పెట్టారు. అయితే ఎలాంటి హింసా జరగలేదని పోలీసులు తెలిపారు. ఆల్కోచ్ రాజ్భోంగ్షీ స్టూడెంట్స్ యూనియన్, ఆల్ బోడో మైనార్టీ స్టూడెంట్స్ యూనియన్, ఆల్ ఆదివాసి స్టూడెంట్స్ యూనియన్, ఒబోరో సురక్షా సమితి, కలిత జనగోష్టి స్టూడెంట్స్ యూనియన్ వంటి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. బోడోలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్స్లో ఉంటున్న నాన్ బోడో సంఘాలను కూడా చర్చలకు పిలువాలని వారు డిమాండ్ చేశారు. ఒప్పందంను చదివి తమ ఒపీనియన్ కూడా తీసుకోవాలని డిమాండ్ చేశాయి.