విలన్లు జలసమాధి: ఇద్దరూ ఇలా ఫినిష్
బెంగళూరు: మాస్తిగుడి కన్నడ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో హెలికాప్టర్ నుంచి కిందకు దూకి జలసమాధి అయిన ప్రతినాయకులు అనీల్, ఉదయ్ మృతదేహాలను ఎట్టకేలకు బయటకు తీశారు.
గురువారం వేకువ జామున 5.50 గంటల సమయంలో తిప్పగుండనహళ్ళి జలాశయం (చెరువు)లో అనీల్ మృతదేహాన్ని ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకు వచ్చారు. అనీల్ మృతదేహాన్ని చూసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు.
బుధవారం అర్దరాత్రి 1.30 గంటల వరకు అనీల్ మృతదేహం కోసం గాలించినా ఫలితం లేదు. గురువారం వేకువ జామున ఎన్ డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలిస్తున్న సమయంలో అనీల్ మృతదేహం చిక్కింది.
హెలికాప్టర్ నుంచి కిందకు దూకిన ప్రాంతానికి 50 మీటర్ల దూరంలోనే అనీల్ మృతదేహాన్ని గుర్తించారు. బుధవారం ఉదయ్ మృతదేహాన్ని బయటకు తీశారు. తిప్పగుండనహళ్ళి చెరువు సమీపంలోనే మృతదేహాలకు వైద్య పరిక్షలు నిర్వహించనున్నారు.
మృతదేహాలకు వైద్య పరిక్షలు నిర్వహించిన తరువాత భౌతికకాయాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. గువారుం అనీల్, ఉదయ్ భౌతికకాయాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు.