దారుణం: స్కూల్ టాయ్లెట్లో రక్తపుమడుగులో విద్యార్థి మృతదేహం
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పాఠశాలలోని టాయిలెట్లో ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహానికి కత్తిపోట్లు ఉండటం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. వడోదరలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14ఏళ్ల కుర్రాడి మృతదేహం టాయిలెట్లో రక్తపు మడుగులో పడివుంది. బాలుడి శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి.
శుక్రవారం మధ్యాహ్నం రక్తపుమడుగులో ఉన్న బాలుడి మృతదేహాన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద లభించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం తెలిసే అవకాశం ఉంది. కాగా, ఈ ఘటన గత సంవత్సరం సంచలనం రేపిన గుర్గావ్లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ప్రద్యుమన్ ఠాకూర్ హత్యకు గుర్తు తెచ్చేలా ఉంది.